హైదరాబాద్: పి.జనార్దన్ రెడ్డి(పిజెఆర్) నేతృత్వంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీకి పునాది పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ పేరును హైటెక్ సిటీగా మార్చి చంద్రబాబు అభివృద్ధి చేశారని సిఎం చెప్పారు. శనివారం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పిజెఆర్ ఫ్లైఓవర్ ను సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పిజెఆర్ ఇల్లు ఒకప్పుడు జనతా గ్యారేజీగా ఉండేదని, జంట నగరాల సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేసేవారని చెప్పారు. ఆయన కృషి వల్లే నగరంలోకి సురక్షిత మంచి నీరు వచ్చిందని తెలిపారు. వాజ్పేయీ, పీవీ నర్సింహారావు వల్లే ఐటీ కారిడార్ అభివృద్ధి జరిగిందన్నారు.
కాగా, రూ.182.75 కోట్లతో 6 లేన్లతో 1.2 కిలోమీటర్ల మేర పిజెఆర్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.