Wednesday, September 3, 2025

బెండలపాడులో ఇండ్ల పండుగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మంబ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చం ద్రుగొండ మం డలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బెండలపాడు గ్రామంలో జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను గృహనిర్మాణ శాఖ ఎండి వి. పి.గౌతమ్, జి ల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రా వు, ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్యతో కలిసి మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలపాడు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ఒక చారిత్రక ఘట్టమని అన్నారు. ఆ గ్రామ ప్రజలకు ఇది  సంతోషకరమైన, గుర్తుండిపోయే రోజు అవుతుందని అన్నా రు.

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయం తో, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అధికారులు గృహప్రవేశ వేడుకలను పండుగ వాతావరణంలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని అన్నారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గ్రామాన్ని అందం గా తీర్చిదిద్దడంలో ఎలాంటి లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గృహనిర్మాణ శాఖను బలోపేతం చేస్తూ, పేదవారికి న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుండి వారి ఖాతాల్లో నిధుల జమ వరకు మొత్తం ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటివరకు కొందరిని సస్పెండ్ చేయడం, కేసులను ఏసీబీకి అప్పగించడం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి ఓటు వేసిన వారికే కాకుండా, రాజకీయాలు, కులం,

మతం అనే తేడా లేకుండా ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ పథకం వల్ల జిల్లాలోనే సుమారు 21,500 కుటుంబాల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గృహప్రవేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లబ్ధిదారులను ఉద్దేశించి ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సంతోషంలో పాలుపంచుకుంటారని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను నిర్వీర్యం చేసి, పేదవారి కలలను దెబ్బతీసిందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహనిర్మాణ శాఖను తిరిగి బలోపేతం చేసి, లక్షలాది పేదల ఇండ్ల కలను నిజం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ మహత్తర గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్‌చార్జ్ మంత్రి వాకాటి శ్రీహరి, ఇతర సహచర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ పరిశీలనలో మంత్రితో పాటు టీజీ ఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News