మన తెలంగాణ/హైదరాబాద్: మెట్రో ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ వివరించారు. మెట్రో ఫేజ్-II సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు
రహదారులపై రద్దీ తగ్గుతుందని సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్తో తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సిఎం గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమ తులు ఇప్పించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపిలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎపి జితేందర్ రెడ్డి, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.