Thursday, August 21, 2025

మూసీ ప్రక్షాళనతో గోల్డ్‌సిటీ

- Advertisement -
- Advertisement -

ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రోరైలును మూసీకి కనెక్ట్ చేస్తాం 2034లోగా
ఫ్యూచర్ సిటీ పూర్తి చేస్తాం మధ్యతరగతి కోసం హైదరాబాద్‌లో
రాజీవ్ స్వగృహ భవనాలు ఫైవ్‌స్టార్ హోటల్, అంతర్జాతీయస్థాయి
సౌకర్యాలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి
ఖర్చు లేకుండా భవనాల నిర్మాణం గచ్చిబౌలి ఇంటిగ్రేటెడ్ సబ్
రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపనలో సిఎం నేడు ఢిల్లీకి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని, ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణాన్ని కూడా కొంతమంది అవహేళన చే శారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళనపై కూడా విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలని సిఎం అన్నారు. ఓల్డ్‌సిటీని గోల్డ్‌సిటీగా మార్చాలంటే మూసీ ని ప్రక్షాళన చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరం టోక్యో, న్యూయార్క్ లతో పోటీపడుతుందని సిఎం రేవంత్‌రెడ్డి  అన్నారు. అమెరికాలో మన ఐటీ నిపుణులు పనిచేయడం ఆపివేస్తే స్తంభించిపోతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో ఒన్ బిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు.

లివేటెడ్ కారిడార్లు, మెట్రోరైల్‌ను కూడా మూసీకి కనెక్టివిటీ చేస్తాం
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర అభివృద్ధి 2047 కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ అది ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని, గోదావరి జలాలను తీసుకొచ్చి 365 రోజులు మూసీలో నీరు ఉండేలా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ తెలిపారు. గజం స్థలం దొరకనోళ్లు మూసీ మురికిలో ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూసీని ప్రక్షాళన చేసి నైట్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతంలో 24 గంటలు వ్యాపారం జరిగేలా చూస్తామని సిఎం హామీనిచ్చారు. దీంతోపాటు ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రోరైల్‌ను కూడా మూసీకి కనెక్టివిటీ చేస్తామని ఆయన తెలిపారు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మౌలిక వసతులు లేవు
ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నెలకొన్న ఇబ్బందులకు శాశ్వతంగా పరిష్కరించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఔటర్ పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నాయని అందులో నిలబడడానికి ప్లేస్ లేదని, కూర్చోవడానికి కుర్చీ లేదని సిఎంం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి అంటున్నామని, దిగ్గజ కంపెనీలున్నాయని గొప్పలు చెబుతున్నామని, కానీ, ఇంత వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మౌలిక వసతులు లేవని ముఖ్యమంత్రి చెప్పారు. సంవత్సరానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే వాళ్లు డబ్బులు చెల్లించి కూడా ఇబ్బంది పడుతున్నారని సిఎం పేర్కొన్నారు. వేల కోట్ల ఆదాయం ఇచ్చే వాళ్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వస్తే కుర్చోవడానికి కుర్చీలేని పరిస్థితి ఉందని అందుకే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం
మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ భవనాలను నిర్మించాలని నిర్ణయించామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే నగర అభివృద్ధితో పాటు నగర విస్తరణ జరగాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నామని, ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తూ, అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించబోతున్నామని ఆయన తెలిపారు. ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్థాయి సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిర్మిస్తామని, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఈ కార్యాలయాలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

దాదాపు 50 వేల చదరపు అడుగుల స్థలంలో….
2 జూన్ 2026 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పొంగులేటికి సూచిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2034 ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపు చూస్తుందని, ఆ స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నగర అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువులాంటివారని, దొంగల పని పట్టాల్సింది మీరేనని సిఎం పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని, పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసి ప్రపంచంలో మొదటి స్థానంలో కృషి చేస్తున్నామని, దాదాపు 50 వేల చదరపు అడుగుల స్థలంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అన్ని హంగులతో నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.

రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లే ఐటీ రంగం అభివృద్ధి
హైదరాబాద్ చారిత్రాత్మక నగరమని, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ గుర్తింపు పొందడానికి ఆనాటి కూలీ కుతుబ్ షాహీ నుంచి ఈనాటి వరకు ఎంతోమంది కృషి చేశారని ఆయన అన్నారు. వారి కృషి వల్లే ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా హైదరాబాద్‌కు కీర్తి ప్రతిష్టలు దక్కాయన్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషి వల్లే దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, తెలంగాణలోనూ హైటెక్ సిటీ అభివృద్ధికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందని ఆయన తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఇక్కడికి వచ్చాయంటే ఆనాటి ముఖ్యమంత్రుల దూరదృష్టే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్టాంప్స్, రిజిస్ట్రార్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హన్మంతు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News