హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం 2025 సందర్భంగా గురువారం నగరంలోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, దిల్ రాజు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్గా పిలుస్తామని.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని సిఎం అన్నారు. రాష్ట్రంలోని పలు కాళాశాలలు, పాఠశాలల ముందు ఉండే కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని… స్కూళ్లు, కాలేజీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎం హెచ్చరించారు. ఏ స్కూల్, కాలేజీలో డ్రగ్స్, గంజాయి దొరికినా.. యాజమాన్యంపైనా కేసులు పెడతామని, వారిపై చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.