భూభారతితో వ్యవసాయ భూములకు రక్షణ కల్పిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి సిఎం మాట్లాడారు. 8 నెలల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నామని.. అలాగే, భూమిలేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో డిఎస్సి ప్రకటించి 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని సిఎం పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. 27 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మిస్తున్నామని సిఎం రేవంత్ అన్నారు.