రేపు(శుక్రవారం) సాయంత్రం సిఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా సమాచారం. 24వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరుకానున్నట్టుగా తెలిసింది. తెలంగాణకు అవసరమైన నిధులపై ఇప్పటికే ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయడంతో పాటు నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్న ఎజెండాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సిఎం రేవంత్రెడ్డి బృందం కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
అందులో భాగంగా రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, అనుమతుల విషయంపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలిసింది. దీంతోపాటు పిసిసి జంబో కార్యవర్గం రెండు, మూడురోజుల్లో ఏఐసిసి ప్రకటించనున్న నేపథ్యంలో దీనిపై అధిష్టానం పెద్దలతో సిఎం రేవంత్రెడ్డి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ జూన్లో ప్రకటించే అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించనున్నట్టుగా సమాచారం.