కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలి
పాతికేళ్ల అవసరాలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలి
మెట్రో పనులను వేగవంతం చేయాలి
ఎంఏయూడి సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి పరిస్థితి హైదరాబాద్లో తలెత్తకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని సిఎం సూచించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని, దీనికోసం రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో అధ్యయనం చేయాలని సిఎం అధికారులకు సూచించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ లింక్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అన్ని శాఖల అధికారులు సమగ్ర డిపిఆర్లను తయారు చేయాలని సిఎం సూచించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను నగరంలో ఎక్కడపడితే అక్కడ డంప్ చేయకుండా చూడాలని సిఎం ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో మంచినీటి సరఫరా, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా నగర మంచినీటి సరఫరా సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఎం సూచించారు. బోర్డు తమకున్న వనరులను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సిఎం సూచించారు. ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకుగాను కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దానిని మరింత బలోపేతం చేయాలని సిఎం ఆదేశించారు. మార్గదర్శకాల రూపకల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మెట్రో పనులు త్వరగా పట్టాలెక్కేలా
పాతబస్తీలో మెట్రో పనుల గురించి సిఎం ఆరా తీశారు. అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున అక్కడక్కడ మెట్రో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్ల అనుమతులు, తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యాన్ని సహించబోమని సిఎం రేవంత్ హెచ్చరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని సిఎం ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్ను నిర్మించాలని సిఎం సూచించారు. మూసీపైన బ్రిడ్జి కం బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. అనుమతులు, నిబంధనల విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులతో సిఎం తెలిపారు.
జూపార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు
నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో పురోగతి గురించి సిఎం సమీక్షించారు. మీరాలం ట్యాంక్ ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపిలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా చూడాలని సిఎం ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని, పార్క్, మీరాలం ట్యాంక్ తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సిఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్రాజ్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది (హెచ్ఎండిఏ ఏరియా) కార్యదర్శులు ఇలంబర్తి, టి.కె.శ్రీదేవి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్సీడిఏ కమిషనర్ కే.శశాంక, వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, మెట్రో రైలు ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండి ఇ.వి. నరసింహారెడ్డి, జేఎండి గౌతమి తదితరులు పాల్గొన్నారు.