సి.నా.రె అనే మూడక్షరాలు తెలుగు, ఉర్దూ, సంస్కృతం మూడు భాషల సంగమం. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు లోకాల మిశ్రమం. డా. సి. నారాయణ రెడ్డి అవిభక్త కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామం లో కర్షక కుటుంబంలో (గురుపూర్ణిమ) నాడు 29 జులై 1931 నాడు జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి. నారాయణ రెడ్డి ఇంటిపేరు సింగిరెడ్డి. దేవుని మొక్కువల్ల కొడుకు పుట్టాడని, సత్యనారాయణరెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అయితే సిరిసిల్ల మాధ్యమిక పాఠశాలలో కొడుకును చేర్పించే సమయాన ‘సి. నారాయణ రెడ్డి’ అని నమోదు చేయించడం చేత, అదే పేరు స్థిరపడింది. హనుమాజిపేటలో ఆనాడు ప్రభుత్వ పాఠశాల లేనందువల్ల, వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయుడు నడిపిన వీధి బడిలో ఆయన చదువుకు శ్రీకారం చుట్టి, ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు.
తరువాత సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో తెలుగును ఒక ఐచ్ఛిక విషయంగా గ్రహించి, మాధ్యమిక స్థాయి విద్యను అభ్యసించారు. 1948 లో కరీంనగర్లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. సినారెలో సహజంగా సృజనాత్మకశక్తి, లయాత్మకత, చిన్ననాటి నుండే ఉన్నాయి. చిన్నప్పటి నుండి మట్టిలో పుట్టిన జానపద గీతాలను ఆలపించేవారు. హరికథలు, బుర్రకథలంటే చెవికోసుకునేవారు. హరికథా కథనాన్ని ఆశువుగా, సంగీతాత్మకంగా అనుకరించేవారు. ఆరేడు తరగతులనుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. ఛందస్సంటే తెలియని దశ అది. ఏడవ తరగతిలో సీస పద్యమని తెలియని దశలో ‘ఒకనాడు ఒక నక్క ఒక అడవిలో పొట్ట కోసర మెటో పోవుచుండె’ అనే పంక్తితో ప్రారంభించి పద్యం రాస్తే – అది సీస పద్యమని తెలిసి ఛందస్సుకు సంబంధించిన కొన్ని మెలకువలను తెలిపారు దూపాటి వేంకట రమణాచార్యులు.
తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు రాసిన -‘మారుటెన్నడో విషంపు గుండెలీ జగాన మారుటెన్నడో’ అనేది సినారె తొలి గేయం. పదవ తరగతిలో ఉన్నప్పుడు ‘వెన్నవంటి మనసున్నవానికి, అన్నమేమొ కరువాయె/ ఉన్నవాని కింతన్న వీడుదా/ మన్న గుండె లేదాయె’ వంటి పాటలు రాశారు. కరీంనగర్ విద్యార్థి మహాసభలో విజయంబు సాధించినావా విద్యార్థి, నీ వీర భావాలు నింగి వ్యాపించగా; నీ వైరిచిత్తాల నేల కంపించగా’ వంటి గేయాలు రచించి పాడారు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాస కాలంలోనే, నైజాం రాష్ట్రానికి స్వాతంత్య్రం రావాలని జరిపిన విద్యార్థుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు. హైదరాబాదు ఛాదర్ఘాట్ కళాశాలలో (ఛాదర్ఘాట్ కళాశాలలో) ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ మీడియట్ (1948 -49) ముగించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో ఆయన కవిత తొలిసారిగా ప్రచురితమైంది. ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం అనే పద్య నాటికలను రాశారు.
‘భలే శిష్యులు’ వంటి సాంఘిక నాటికలను రచించారు, ప్రదర్శించి, నటులుగా తామూ పాత్రధారణ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలోనే బిఎ(1952) చదివారు. బిఎ ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు, ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆర్ట్ కళాశాల విద్యార్థుల సాహితీ సంచిక – ‘శోభ’కు సంపాదకత్వం నిర్వహించారు. 1954లో ఎం.ఎ. పట్టా పొందారు. ఎం.ఎ. విద్యార్థిగా ‘సినీ కవి’ అనే నాటికను రాసి, ‘మకరంద మూర్తి’ అనే పాత్రను ధరించి, దర్శకత్వం వహించి, ఉత్తమ బహుమతిని అందుకున్నారు. ‘ఆచార్య కె. గోపాలకృష్ణారావు, ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య దివాకర్ల వేంకటావధాని తదితరులు ఆయన గురువులు. దక్షిణ భారతం నుండి రాజ్యసభ సభ్యులుగా నియమింపబడిన ప్రథమకవి ఆయనే కావడం విశేషం. ‘నవ్వని పువ్వు’ (1953) మొదలుకొని, ‘అలలెత్తే అడుగులు’ (2013), నింగికెగిరే చెట్లు (2014) వరకు 18 ప్రక్రియలలో సుమారు 90 గ్రంథాలు రచించారు.
మాకందా’లను అందించడంలో వచన కవిత్వంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో ప్రపంచ పదులను నిర్మించడంలో తెలుగు గజళ్ళకు మానవీయ దృక్పథాన్ని అనుసంధించడంలో, ప్రతీకాత్మకంగా వచన కవితలో ఇతిహాస కావ్యాన్ని -‘విశ్వంభర’ను నిర్మించడంలో, ‘మట్టీ మనిషీ -ఆకాశం’ వంటి వచన కవితా ‘కావ్యేతి హాసాన్ని’ సంవిధాన సంపన్నంగా సృజించడంలో, ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ వంటి స్వీయ చలన చిత్ర గీతికా వ్యాఖ్యా రచనలో, ఋతు వర్ణనలను జీవితానికి సమన్వయిస్తూ ‘ఋతుచక్రం’ వంటి కావ్య రచనలో, గేయ కావ్యాలకు పద్య కావ్యప్రౌఢిని, ప్రామాణికతనూ సంతరించడంలో, శత శతాధిక నూతన పదబంధ కల్పనంలో మహాకవి సినారె ప్రయోగశీలం ప్రస్ఫుటమవుతుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే, 1962లో ఎన్టి రామారావు ఆహ్వానంపై చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. తొలి సినీ గీతం -‘నన్ను దోచుకొందువటే’ ‘గులేబకావళి కథ’ చిత్రంలోని పాటలన్నీ ఆయన రాసినవే. ఆనాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి ఇటీవలి ‘అరుంధతి’, ‘మే స్త్రి’ సినిమాల వరకు, మూడున్నర వేలకు పైగా సినిమా పాటలు రచించి, చలన చిత్ర జగత్తులో తమ ప్రత్యేక స్థానాన్ని భద్రపరచుకున్నారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలీ’ అనే రెండు చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. ఘంటసాల గళం నుండి సినారె గీతాలధికంగా జాలు వారాయి. మూగజీవులు, శభాష్ పాపన్న, మొగుడా పెళ్ళామా, తూర్పు పడమర చిత్రాలలో కావ్య సంబంధమైన పాత్రలలో ఆయన కనిపించారు.
- రామ కిష్టయ్య సంగనభట్ల, 94405 95494
- ( నేడు సి నారాయణరెడ్డి వర్ధంతి)