Sunday, August 10, 2025

ఓఆర్‌ఆర్‌పై గేట్ వే ఆఫ్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్ వే అఫ్ హైదరాబాద్ నిర్మాణం జరగాలి
గాంధీ సరోవర్‌కు స్వాగత తోరణంగా అత్యంత ఎత్తులో ఐకానిక్ టవర్‌ను నిర్మించాలి
దానికి తగిన విధంగా డిజైన్లు రూపొందించాలి
బహుళ ప్రయోజనాలుండేలా మూసీ పునరుజ్జీవం ఉండాలి
అధికారులతో సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనాలుండేలా అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా హిమాయత్‌సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్‌ఆర్‌పై గేట్ వే అఫ్ హైదరాబాద్ నిర్మించాలని ఆయన సూచించారు. ఓఆర్‌ఆర్‌కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేసి మరోవైపు బాపూఘాట్ వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని సిఎం అదేశించారు. శనివారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌కు ఒక వైపున ఉండే ఎకో థీమ్ పార్క్, మరో వైపు నిర్మించే ఐకానిక్ టవర్‌ను చేరుకునేందుకు ప్రయాణాలకు వీలుగా ఎలివేటెడ్ గేట్‌వేను నిర్మించి దాన్ని గేట్ వే అఫ్ హైదరాబాద్‌గా డిజైన్ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అదేశించారు. బాపూఘాట్ చుట్టూ ఉన్న ఏరియా ను వరల్డ్ క్లాస్ జోన్‌గా అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

రెండు నెలల్లో టెండర్లను పిలవాలి
హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని గాంధీ సరోవర్ చుట్టూ ఈ ప్లైఓవర్ కనెక్టివ్ కారిడార్‌లా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్‌కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తయిన టవర్‌గా నిర్మించాలని సిఎం సూచించారు. సాధ్యా సాధ్యాలు పరిశీలించాలని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఎత్తున నిర్మించాలన్న విషయమై ఒక అంచనాకు రావాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

తాగునీటితో పాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఉండాలని, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్ట్ నమూనాలు పరిశీలించాలని సిఎం రేవంత్ చెప్పారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటిని హైదరాబాద్ అవసరాల కోసం తీర్చేందుకు మరింత సమర్ధంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. స్థలం వృధా కాకుండా మూసీ పరీవాహక ప్రాంతం ఇరువైపులా అండర్ గ్రౌండ్‌లో భారీగా వాటర్ స్టోరేజ్ సంప్‌ను నిర్మించడంతో పాటు దానికోసం సదుపాయాలను ఏర్పాటు చేయడం అక్కడి నుంచి వాటర్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ చెప్పారు. గాంధీ సరోవర్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News