ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఆయన పాలన ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ఆర్థిక విధానాల చుట్టూ కొనసాగుతూ ఉంది. రక్షణ, రైల్వేలతో సహా అనేక రంగాల్లో ఎక్కువ విదేశీ పెట్టుబడులను అనుమతించడానికి మోడీ ప్రభుత్వం భారతదేశ విదేశీ పెట్టుబడి విధానాలను సరళీకరించింది. దేశ, విదేశీ బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా దేశఆర్థిక విధానాలు అమలు చేస్తున్నది. ఫలితంగా దేశంలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, ఉపాధి సమస్య తీవ్రంగా ఉంది. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకంటూ దేశ, విదేశీ కంపెనీలు దేశంలో ఉత్పత్తులు తయారు చేయటాన్ని ప్రోత్సహించడానికి 2014 సెప్టెంబర్లో మోడీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రవేశ పెట్టింది. దీని ద్వారా విదేశీ కార్పొరేట్ సంస్థలు భారత మార్కెట్లో ఎక్కువ వాటాను స్వాధీనం చేసుకోవటానికి వీలు కల్పించింది.
‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) లక్ష్యం తయారీ రంగం వృద్ధి రేటుని సంవత్సరానికి 12.14% పెంచటం, 2022 నాటికి జిడిపికి తయారీ రంగం వాటాను 25% పెంచటం. (తర్వాత దీన్ని 2025కి సవరించారు) 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో 100 మిలియన్ల అదనపు తయారీ ఉద్యోగాలు సృష్టించటం. వీటిని సాధించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2022 నాటికి జిడిపి తయారీ రంగం వాటా 25 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయగా, 2013-14లో 16.7% ఉండగా, 2023- 24 నాటికి 15.9 శాతానికి జిడిపి పడిపోయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించకపోగా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని లక్షలాది ఉద్యోగాలు తొలగించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందినట్లు మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఆర్థిక వ్యత్యాసాల్లోనూ, అప్పులు చేయడంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలోనూ, పేదరికంలోనూ, ఉద్యోగాలు కల్పించకపోవటంలోను మోడీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి మాత్రం వాస్తవం.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు జరుపుతున్న ఆర్థిక విధానాలు కేవలం శత కోటీశ్వర్లకు మేలు చేయగా, పేదలకు తీవ్ర సమస్యలు సృష్టించింది. 2015లో భారత్ లో శత కోటీశ్వర్లు 97 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 210 కి చేరింది. దీన్ని గమనిస్తే దేశ సంపద పేదల దరి చేరలేదనేది సుస్పష్టం. ఒక శాతం భారత జనాభా వద్ద 40 శాతం సంపద ఉంటే, 50 శాతం ఉన్న పేద వర్గాల వద్ద కేవలం 3 శాతం సంపద ఉంది. మోడీ ఆర్థిక విధానాలు పేదలను పేదలుగానే ఉంచింది. 2011 నుంచి ప్రభుత్వం పేదరికం, ఉపాధిపై అధికార డేటా ప్రకటించక పోవటంతో భారత ఆర్థిక పరిస్థితులను అంచనా వేయటం సాధ్యం కావటం లేదు. భారత ప్రభుత్వ గణాంక సంస్థ పేదరికం, ఉపాధిపై నిర్వహించే సర్వేలు నమ్మదగినవి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2014లో మోడీ అధికారంలోకి వచ్చే నాటికి దేశానికి రూ. 84 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇందులో స్వదేశీ అప్పు రూ. 47.34 లక్షల కోట్లు కాగా, విదేశీ అప్పులు రూ. 37.4 లక్షల కోట్లు కాగా, 2025 నాటికి దేశం రూ. 224 లక్షల కోట్ల అప్పులకు చేరింది. ఇందులో స్వదేశీ అప్పులు రూ. 166.57 లక్షల కోట్లు కాగా, విదేశీ అప్పులు 57.4 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. మోడీ అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ బాగా దిగజారింది. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు రూపాయి విలువ 60 రూపాయలుగా ఉంటే, మోడీ పాలనలో ఇప్పుడు 86 రూపాయలుగా ఉంది. తాజా లెక్కల ప్రకారం ఆహార సూచికలో ప్రపంచంలోని 127 దేశాల్లో భారత దేశం 105 స్థానంలో ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో దేశ ఆకలి సూచిక స్కోరు 28.8 నుంచి 27.38కి మారింది.
అదే కాలంలో పాకిస్తాన్లో స్కోర్ 29.8 నుండి 27.98 తగ్గింది. దేశ తలసరి ఆదాయంలో భారత్ 136వ స్థానంలో ఉండగా, అతిపేద దేశం శ్రీలంక 133వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 6.5%తో అభివృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. ఇది మరే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల కన్నా ఎక్కువగా ప్రచారం చేయబడుతున్నది. అది వాస్తవం కాదు. 1987లో చైనా భారత ఆర్థిక ఆదాయం 0.27 ట్రిలియన్ల డాలర్లతో సమానంగా ఉన్నాయి. 2025 నాటికి భారత జిడిపి 4.19 ట్రిలియన్ డాలర్లు కాగా, చైనా జిడిపి 19.23 ట్రిలియన్ డాలర్లు. అంటే భారత్ కన్నా నాలుగు రెట్లు పైగా ఎక్కువ. ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 13,687 డాలర్లు కాగా, భారత తలసరి ఆదాయం 2,880 డాలర్లు మాత్రమే. పేదలకు ఈ ఆదాయం కూడా లేదు. దీన్ని గమనిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల వాస్తవ రూపంలో లేదని అర్థమవుతుంది.
11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను పెద్ద ఎత్తున అమ్మకాలకు పెట్టారు. దీన్ని సమర్థించుకోవటానికి, ప్రభుత్వం వ్యాపారం చేయదని అది ప్రభుత్వ విధానం కాదని, ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను అమ్మి ఆ డబ్బులను ప్రజాసంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పటంలో వంచన దాగి ఉంది. ప్రధాని మోడీ ఒక విషయాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ సంస్థలు, ఆస్తులు ప్రజా సంక్షేమం కోసం ఉన్నవే గాని లాభాల కోసం ఏర్పాటు చేసినవి కాదు. ప్రజా సంక్షేమం పట్టని మోడీ ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను బడా పెట్టుబడిదారులకు కారుచవకగా అమ్ముతున్నది. తొలి ఐదు సంవత్సరాల పాలనలో ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం పొందింది.
మలి విడత పాలనలో 1.5 లక్షల కోట్లను పొందింది. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను ప్రైవేట్ సంస్థల పరం చేస్తున్నది. మొండి పారు బకాయిల పేరుతో బడా పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 14 లక్షల కోట్ల అప్పులను రద్దు చేయడం మోడీ ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతున్నది. మోడీ ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశంలో పని చేసే జనాభాలో 60% దాక వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ అందుకు విరుద్ధంగా రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు జరుపుతున్నారు. పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించి వాటికి చట్టబద్ధత కల్పించటానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. మూడు వ్యవసాయ చట్టాల ద్వారా పంటల కొనుగోళ్ల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. రైతుల ఆందోళనతో మూడు చట్టాలు రద్దు చేసినా, వాటిని దొడ్డిదారిన అమలు చేస్తున్నది. విత్తనాలు, ఎరువుల, పురుగుమందుల ధరలు అరికట్టలేకపోయింది.
గ్రామీణ గణాంకాల శాఖ 2021- సెప్టెంబర్ -10న ప్రకటించిన శాంపిల్ సర్వే ప్రకారం చిన్న రైతులకు వ్యవసాయం ద్వారా రోజు వారీ లభించే సగటు ఆదాయం 27 రూపాయలు. నెలకు 816 రూపాయలు. వ్యవసాయ ఆదాయంతోపాటు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కలుపుకుంటే కుటుంబ ఆదాయం కొంత పెరుగుతుంది. 2012 -13 లో కుటుంబాల సగటు అప్పు రూ. 47 వేలు కాగా, నేడు రూ. 80 వేలకు పైగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 లక్షలకు పైగా ఈ అప్పు ఉంది. అప్పుల ఊబి నుంచి బయటపడలేక 4 లక్షల దాకా రైతులు బలవన్మరణాల పాలయ్యారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ పేదలు, కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. నిరుద్యోగం పెరుగుతూ ఉంటే, మరో పక్క సంపద కేంద్రీకరణ పెరిగింది. దేశం అప్పుల్లో కూరుకుపోయింది. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల ఐక్యంగా ఉద్యమించాలి.
- బొల్లిముంత
సాంబశివరావు
9885983526