జనగామ జిల్లా, లింగాలఘనపురం మండలం, వడ్డిచెర్ల వద్ద జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు దుర్మరణం కాగా, వారి ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎస్ఐ శ్రావణ్కుమార్, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం…ఆంధ్రప్రదేశ్లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దోలు సురేష్, అతని భార్య దివ్య, వారి ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ, లోక్షణతో స్వగ్రామంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొని, కారులో కరీంనగర్ వస్తున్నారు.
నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ కల్వర్టును కారు ఢీకొట్టడంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్యను 108 వాహనంలో చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. వారి పిల్లలు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు సురేష్ కరీంనగర్లోని ఒక గ్రానైట్ కంపెనీలో గ్రానైట్ మార్కర్గా పనిచేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.