ఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో అక్టోబర్ 20న తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్లో జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా పని చేశారు. తమిళనాడులో గతంలో 93 రోజుల పాటు 19 వేల కిలో మీటర్లు రథయాత్ర నిర్వహించారు. ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్గా సేవలందించారు. తమిళనాడు మోడీగా రాధాకృష్ణన్కు బిజెపిలో మంచి పేరు ఉంది. తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠం అధిష్ఠించిన మూడో వ్యక్తిగా ఉన్నారు. గతంలో తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్ రామన్ పని చేశారు.
Also Read: రూ.1000 కోట్లు సినిమాలు లేవు కానీ… ఆ వ్యాధి నాకు ఎంతో నేర్పింది: సమంతా
67 ఏళ్ల రాధాకృష్ణన్ మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో గెలిచిన విషయము తెలిసిందే. జగ్దీప్ ధనఖడ్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పలేదు. మహారాష్ట్రలో గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వహించడానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ను రాష్ట్రపతి ముర్ము నియమించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక సి.పి.రాధాకృష్ణన్ గురువారం తన మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను వదులుకున్నారు.