టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మలు (Rohit Sharma) గత ఏడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ తర్వాత టీ-20 ఫార్మాట్కి.. కొద్ది రోజుల క్రితం టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికి ఒక ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించినా బాగుండేది అని అభిమానులంతా అనుకున్నారు. కానీ, పరిస్థితుల వల్ల అది కుదరలేదు. కానీ, ఇప్పుడు కోహ్లీకి, రోహిత్కి ఓ బోర్డు ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు ముందుకు వచ్చింది.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉన్న కోహ్లీ (Virat Kohli), రోహిత్లు (Rohit Sharma) 2027 వన్డే ప్రపంచకప్ వరకూ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఆగస్టులో కోహ్లీ, రోహిత్లు బంగ్లాదేశ్లో మూడు వన్డేల సిరీస్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్టోబర్లో ఆస్ట్రేలియా సిరీస్లో ఆడతారు. ఒకవేళ ఈ సిరీస్లో రోహిత్, కోహ్లీ పాల్గొంటే ఆస్ట్రేలియాలో వీరికి ఇదే చివరి సిరీస్ అవుతుంది. దీంతో వీరికి ఆస్ట్రేలియాలో ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా సిఇవొ టాడ్ గ్రీన్బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘‘అక్టోబర్లో జరిగే ఈ సిరీస్ రోహిత్, కోహ్లీకి ఆస్ట్రేలియాలో ఆడే చివరి సిరీస్ కావొచ్చు. ఒకవేళ అదే నిజమైతే.. వారికి ఘనంగా వీడ్కోలు పలకాల్సిన ధర్మ మాకుంది. వాళ్లిద్దరు భారత క్రికెట్కే కాదు.. అంతర్జాతీయ క్రికెట్కి ఎంతో చేశారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేస్తాం’’ అని టాడ్ గ్రీన్బర్గ్ పేర్కొన్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.