హైదరాబద్: గణేష్ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నాలుగో సారి అని సివి ఆనంద్ (CV Anand) తెలిపారు. శనివారం నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 170 మంది ట్రైనీ ఐపిఎస్ అధికారులు TGICCC భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాళ్లు సివి ఆనంద్తో ముఖాముఖిగా మాట్లాడారు. సివి ఆనంద్ హైదరాబాద్ నగరంలో 10 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన తన అనుభవాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ దేశంలోనే అత్యంత సున్నితమైన, విస్తారమైన నగరాల్లో ఒకటని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, అందుకే పండుగల నిర్వహణ చాలా ముఖ్యమని వివరించారు.
గణేష్ ఉత్సవాలకు పోలీసులు బందోబస్తు ఎలా నిర్వహిస్తారో వివరిస్తూ, ఈ ఏడాది నిమజ్జనం కోసం చివరి రోజున సుమారు 25,000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో జరిగే ఈ ఉత్సవానికి ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా భద్రత కల్పించడం చాలా ముఖ్యమని చెప్పారు. గణేష్ ఉత్సవం, మిలాద్ ఉన్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీ రామనవమి ర్యాలీ వంటి పండుగల సందర్భంగా తొక్కిసలాటలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక, సన్నాహాలు, వ్యూహాలు మరియు ఇతర చర్యల గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆన్లైన్ అనుమతి ఫారాలు, విగ్రహాలకు జియోట్యాగింగ్, డ్రోన్లు, యాప్లు, సిసిటివిల వాడకం, అలాగే మల్టీ-ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి సాంకేతికతను పోలీసులు ఎలా వినియోగిస్తున్నారో కూడా కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో రామ్ నివాస్ సేపట్, ఐపీఎస్, కల్మేశ్వర్ సింగేన్వార్, ఐపీఎస్ మరియు పుష్ప, డీసీపీ, పాల్గొన్నారు.
Also Read : వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు