Saturday, July 19, 2025

సాగర్‌కు పొంచి ఉన్న ముప్పు

- Advertisement -
- Advertisement -

బహుళార్థసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని. లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించే ఈ జలాశయం ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. అయితే, సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు లీకేజీ కావడంతో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును 1967లో జాతికి అంకితం చేయగా, 56 ఏళ్లుగా స్పిల్‌వే నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం స్పీల్ వే మరమ్మతులు 1975 నుంచే నిర్వహిస్తున్నారు. జలశయానికి భారీగా వరద నీరు వచ్చినప్పుడల్లా స్పిల్‌వే దెబ్బతింటూనే ఉంది. వాస్తవానికి సాగర్ గేట్ల సామర్థ్యం 20 లక్షల క్యూసెక్కులు కాగా, భారీ వరదలతో దెబ్బతిన్నచోట్ల మొదట్లో చిన్న చిన్న మరమ్మతులు చేశారు. 2009లో భారీగా వరద పోటెత్తినప్పుడు స్పిల్‌వే దెబ్బతింది. దీంతో 2010-12 లో రూ.40 కోట్లతో మరమ్మతులు చేపట్టారు.

అప్పుడు జాతీయ నిర్మాణ సంస్థ (ఎన్‌ఏసి) సూచించిన మేరకు కాంక్రీట్ మిక్స్‌డ్ డిజైన్ ప్రకారం ఎం60 గ్రేడ్ సిలికా ప్యూమ్, స్టీల్‌వైర్ ఫైబర్‌తో గుంతలను పూడ్చారు. ఒక క్యూబిక్ మీటరు పరిధిలోని గుంతలను పూడ్చేందుకు స్టీల్‌వైర్ ఫైబర్ 40 కిలోలు వినియోగించారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట మినహాయిస్తే స్పిల్‌వే ఇంతవరకూ దెబ్బతినలేదు. మళ్లీ కొత్త ప్రాంతాల్లో గుంతలు పడినచోట అదే పద్ధతిలో మరమ్మతులు చేస్తే డ్యామ్‌కు భద్రత చేకూరుతుంది. 2012 లో స్పిల్‌వే భారీగా దెబ్బతింది. డ్యాం స్పిల్‌వేకు ఎం 60 కాంక్రీట్ వాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏటా మరమ్మతులు చేస్తున్న పరిస్థితులు మెరుగుపడటం లేదు. ఆ తర్వాత 2013, 2020, 2021 సంవత్సరాల్లో వచ్చిన వరదలకు స్పిల్‌వేపై సుమారు 30 మీటర్ల లోపు భారీగుంతలు ఏర్పడ్డాయి. స్పిల్ వే మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఇంజనీర్లు పలుమార్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు. 2020, 2021లో వచ్చిన వరదలకు గుంతల పరిమాణం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం 2022లో రూ.20 కోట్లు మంజూరు చేసింది.

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో గతంలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది మూడు నెలల పాటు పరవళ్లు తొక్కింది. దీంతో నాగార్జునసాగర్ జలాశయానికి రోజుకు 5 నుంచి 7 లక్షల క్యూసెక్కుల మేర నీరు రావడంతో అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు నెలల పాటు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగడంతో 26 గేట్లలో 20 గేట్ల కింద స్పీల్‌వే దెబ్బతింది. ముఖ్యంగా 11 చోట్ల 5 మీటర్ల వెడల్పు 10 మీటర్ల లోతులో గుంతలు పడ్డాయి. డ్యాం స్పిల్ వేను తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఎన్‌ఎస్‌పి అధికారులతో పాటు డ్యాం నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించడంతో ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.20 కోట్ల నిధులను విడుదల చేశారు.

కోట్ల్లు వెచ్చించి ఏటా మరమ్మతులు చేస్తున్నా మెరుగుపడని తీరు
కోట్లాది రూపాయలు వెచ్చించి సాగర్‌కు ఏటా మరమ్మతులు చేస్తున్నా పరిస్థితులు మెరుగుపడటం లేదు. సాగర్ నుంచి ఏటా లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలే ప్రవాహ సామర్థ్యం గరిష్ఠంగా 20 లక్షల క్యూసెక్కులకు తగినట్లు స్పిల్‌వేను డిజైన్ చేశారు. కానీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్ వే మరమ్మతు పనులకు సంబంధించి రూపకల్పనలో భాగంగా రూ.20 కోట్ల వ్యయంతో 2023 మార్చిలో మొదటి దశ పనులు ప్రారంభించి చివరి దశ పనులు 2023 అక్టోబర్‌లో పూర్తి చేశారు. అయితే ఈ పనులను చేపట్టిన స్వప్న కంస్ట్రక్షన్ గ్రూప్ కంపెనీ గతంలో ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల ద్వారా వరద ఉద్ధృతికి ఏర్పడిన సుమారు 10 అడుగుల లోతు గుంతలను ఆధునిక పద్ధతుల ద్వారా పూడ్చామని,

రాబోయే వరద ఉద్ధృతికి ఈ భారీ గుంతలకు వేసిన కాంక్రీట్ చెదిరిపోకుండా ఉండడానికి విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘ఎం 60 గ్రేడ్ సిలికాన్ ఫైబర్ రీ ఇన్ఫోర్స్ డ్ కాంక్రీట్‘ను ఉపయోగించామని తెలిపారు. వరద రావడంతో స్పిల్ వోగీపై గోతులు పడి దెబ్బతింది. గుత్తేదార్లు చేపట్టిన మరమ్మతుల్లో నాణ్యత లేకపోవడంతో వరదల్లో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గుత్తేదార్లు నిర్మాణంలో నాణ్యత లోపాలు సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రతి ఏటా ప్రవాహ ఉద్ధృతికి అవి పెద్దవై పోతున్నాయి. వీటిని ఉపేక్షిస్తే సాగర్ భద్రతకు ముప్పు అని ఇంజినీర్లు చెబుతున్నారు.

లీకవుతున్న సాగర్ క్రస్టు గేట్లు..పట్టించుకోని అధికారులు!
ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వచ్చిచేరుతోంది. శ్రీశైలం నుంచి 67 వేల క్యూసెక్కుల వరద సాగర్‌కు వస్తోంది. దీంతో నీటిమట్టం 564 అడుగులకు చేరింది. అయితే క్రమంగా పెరుగుతున్న నీటిమట్టంతో సాగర్ డ్యామ్‌కు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టులోని నాలుగు క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకవుతోంది. సాగర్ ప్రాజెక్టుకు మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. వాటిలో 8, 23, 24, 25వ నంబర్ క్రస్ట్ గేట్ల నుంచి వరద బయటకు వస్తోంది. నాలుగు గేట్లకు రబ్బర్ సీల్ నీరు కిందికి వెళ్తోంది.

ఇలా ప్రతిరోజూ 70 క్యూసెక్కుల నీరు లీకవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మేలోనే ఆ గేట్లకు అధికారులు మరమ్మతులు చేశారు. అయినప్పటికీ నీరు లీకవుతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 67,133 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంద. 1800 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 564.90 అడుగుల వద్ద నీరు ఉంది. డ్యామ్‌లో మొత్తం 312 టిఎంసిల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 242.53 టిఎంసిల నీరు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News