కనిపెంచిన పేగు బంధాన్ని కాలరాస్తూ చిన్నారి కన్న కూతురును కర్కషంగా నీటి సంపులో పడేసి హతమార్చిన కసాయి తల్లి ఘటన మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా, లింగాల మండలం, చెన్నంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మేకల మాసమ్మ పెద్దకొడుకైన రాములును 2024 డిసెంబర్ 23న ఆమె కోడలు మేకల ఎల్లమ్మ కుటుంబ కలహాల వల్ల గొడ్డలితో నరికి చంపింది. ఈ కేసులో ఎల్లమ్మ జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం బెయిల్పై తిరిగి వచ్చింది. తనపై కేసు పెడతారా అంటూ ఎల్లమ్మ తన అత్త మాసమ్మతో పాటు తన మరిది కురుమయ్యలను తిడుతూ ఉండేది. ఇంట్లో జరుగుతున్న విషయాలను వాళ్లకు చెబుతావా అంటూ తన రెండవ కూతురైన ఆరేళ్ల నవిత (అమ్ములు) పై ఆగ్రహంతో ఉండేది.
అదే కోపంతో సోమవారం అర్ధరాత్రి నవిత నిద్రపోతున్న సమయంలో ఎత్తుకుని పోయి తన ఇంటి సమీపంలోని బొగ్గుల తిరుపతయ్య ఇంటి ముందు ఉన్న నీటి సంపులో వేసి చంపేసింది. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన బిడ్డను ఎత్తుకుపోయి నీటి సంపులో వేశారని నమ్మబలికే విధంగా గట్టిగా కేకలు వేసింది. సంఘటన స్థలానికి చుట్టుపక్కలవారు వచ్చి ఆమెను గట్టిగా నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి సిఐ రవీందర్ వెళ్లి పరిశీలించారు. మృతురాలి నానమ్మ మేకల మాసమ్మ ఫిర్యాదు మేరకు సిఐ రవీందర్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు.