నైజీరియాలోని ఉత్తర మధ్య పట్టణం మోక్వాలో భయానక వరదలలో ఇప్పటివరకూ 151 మంది వరకూ మృతి చెందారు. శనివారం ఈ విషయాన్ని దేశ అత్యయిక సేవల విభాగం అధికారికంగా తెలిపింది. ఈ పట్టణం ఎక్కువగా మార్కెట్లతో ఉండే ప్రాంతం కావడంతో సంబంధిత వ్యాపారులు ఎక్కువగా నష్టపోయారు. ఇక్కడి నుంచే పలు ప్రాంతాలకు సరుకులు రవాణా అవుతాయి. ఆకస్మిక వరదలతో పరిస్థితి భయానకంగా మారింది.
పలువురి మృతదేహాలు, దుకాణాలలోని కూరగాయలు ఇతర వస్తువులు చాలా దూరం వరకూ కొట్టుకువెళ్లాయి. ఈ ప్రాంతంలో దాదాపు 3వేల మంది వరకూ నిర్వాసితులు అయ్యారని అధికారులు తెలిపారు. దాదాపుగా ఐదు గంటల పాటు ఉధృతి రీతిలో వరదలు ఆకస్మికంగా హోరెత్తాయి. దీనితో స్థానికులు ఎటువంటి రక్షణ చర్యలకు దిగలేకపోయినట్లు తెలిసింది. ఇక్కడి దుర్ఘటనపై నైజిరియా అధ్యక్షులు బోలా టింబూ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.