Friday, June 27, 2025

పరిహారం చెల్లించలేదు.. పంటలు వేయొద్దని నోటీసులు

- Advertisement -
- Advertisement -

మామునూరు ఎయిర్ పోర్టు భూముల పరిహారంపై నెలకొన్న పేచీ తెగడం లేదు. ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి, సంగెం మండలం గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 220 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన 309 మంది రైతులతో నెగోషియేషన్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తొలుత ఎకరానికి 95 లక్షలు పరిహారం చెల్లిస్తుందని ప్రకటించింది. దీంతో భూనిర్వాసితుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. వరంగల్ నగర శివారు, సమీపంలోని తమ భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయని, మార్కెట్ ను బట్టి ఎకరాకు 2 నుంచి 3 కోట్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.

భూసర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని ఆందోళనలకు కూడా దిగారు. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. రైతుల డిమాండ్ ను కలెక్టర్, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన జిల్లా స్థాయి ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో పరిహారం చెల్లింపు అంశం కొలిక్కి వచ్చింది. గాడిపల్లి ప్రాంతంలో వ్యవసాయేతర భూమి కోల్పోతున్న వారికి పరిహారాన్ని తేల్చారు.ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 61134.5 చదరపు గజాల మేర భూములు, ప్లాట్లు కోల్పోతున్న 50 మందికి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఒక్కో చదరపు గజానికి రూ.4887 గా చెల్లించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.మొత్తం 309 మంది రైతుల ద్వారా 220 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరిస్తూ ఎకరానికి కోటి 20 లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.

పరిహారం చెల్లించలేదు..పంటలు వేయొద్దని నోటీసులు..
ఎకరాకు కోటి 20 లక్షల పరిహారానికి గుంటూరుపల్లి భూనిర్వాసితులు ససేమిరా అంటున్నారు.నక్కలపల్లి, గాడిపల్లితో చూస్తే తమ భూములకు డిమాండ్ ఎక్కవుందని గుంటూరుపల్లి రైతులు వాదిస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు 2 కోట్లు ఇవ్వాలంటున్నారు. మరోవైపు ఎకరాకు కోటి 20 లక్షలు ఫైనల్ చేసిన ప్రభుత్వం భూనిర్వాసిత రైతులకు ఈ వానాకాలంలో పంటలు వేయొద్దని నోటీసులు జారీ చేసింది.గుంటూరుపల్లి రైతులు నోటీసులు తీసుకోలేదు. నక్కలపల్లి, గాడిపల్లి లో కొందరు రైతులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే పరిహారం ఒక్క రూపాయి చెల్లించకుండా పంటలు వేయవద్దని నోటీసులు పంపడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నోటీసులను లెక్కచేయకుండా భూమి సాగు చేసుకుంటున్నారు.

ఎకరాకు 2 కోట్లు ఇవ్వాలి : కొత్తపల్లి రత్నాకర్ రావు ( గుంటూరు పల్లి రైతు )
రైతుల గోడును పట్టించుకోకుండా ప్రభుత్వం ఎకరాకు కోటి 20 లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించడం అన్యాయం.
ఇంతకుమించి ఇవ్వలేము.. కోర్టుకు వెళ్లినా పరవాలేదు అని మొండికేయడం ప్రభుత్వానికి తగదు.మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు 2 కోట్లు చెల్లించాలి.
రోడ్డు సౌకర్యం కల్పించాలి :(కనికచర్ల శ్రీకాంత్,గుంటూరుపల్లి రైతు )
ఎయిర్ పోర్టు వల్ల తమ గ్రామానికి ఇప్పుడున్న రోడ్డు మార్గం కనుమరుగవుతుందని అంటున్నారు. తమ గ్రామం మీదుగా నెక్కొండ, మహబూబాబాద్ కు రోడ్డు వేయాలి. విలువైన భూములు కోల్పోతున్న మాకు తగిన పరిహారం ఒకేసారి చెల్లించాలి. అప్పటి వరకు పంటలు సాగు చేసుకుంటాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News