బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అమెరికా ప్రయాణానికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 2వరకు కవిత అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పాస్పోర్టు విడుదల చేయడంతో పాటు విదేశీ ప్రయాణానికి అనుమతినివ్వాలని కోరుతూ ఆమె రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి వినయ్ సింగ్…‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఎంతో ముఖ్యం. అదే సమయంలో అవసరాల రీత్యా విదేశీ ప్రయాణాలు కూడా అందులో భాగం. ఈ హక్కును అనుభవించడానికి పిటిషన్దారును ఎందుకు దూరం చేయాలి. అన్ని రకాలుగా బేరీజు వేసుకున్న తర్వాత,
అందులో పిటిషన్దారు ఇప్పటికే బెయిల్పై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు సిబిఐ, ఇడి తరపు న్యాయవాదులు కవితకు విదేశీ ప్రయాణానికి అనుమతించరాదని వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్లడం న్యాయ సమ్మతం కాదని వాదించారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి తోపిపుచ్చారు. కోర్టు కల్పించిన వెసులుబాటును దుర్వినియోగం చేయవద్దని కవితకు కోర్టు సూచించింది. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసులో కవిత నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 27న ఆమె జైలు నుంచి బయటికి వచ్చారు.