బురఖా ధరించిన ఓ వ్యక్తి యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఐదో అంతస్తు నుంచి తోసేసిన సంఘటన బయట పడింది. తీవ్రంగా గాయపడిన ఆ యువతి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 23 ఉదయం 8.30 గంటలకు అశోక్ నగర్లో నివసిస్తున్న 19 ఏళ్ల నేహా బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్కు చెందిన 26 ఏళ్ల తౌఫీక్ను నిందితుడిగా గుర్తించారు. బురఖా ధరించిన అతడు ఆ రోజు ఉదయం నేహా ఇంటిలోకి ప్రవేశించినట్టు ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు.
బిల్డింగ్పై నుంచి ఆమెను తోసివేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఒకచోట దాగిన అతడ్ని అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా తౌఫీక్, నేహా సహజీవనం చేస్తున్నారని మరో మహిళతో అతడికి వివాహం గురించి తెలియగానే వారిద్దరి మద్య ఐదో అంతస్తుపై గొడవ జరిగినట్టు చెప్పారు. తౌఫీక్ ఆగ్రహంతో నేహాను కిందకు తోయడంతో ఆమె మరణించిందని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. పోలీసుల వాదనను నేహా తండ్రి ఖండించారు. తన కుమార్తెకు తౌఫీక్తో ప్రేమసంబంధం లేదన్నారు. తమ కుటుంబానికి మూడేళ్లుగా అతడు తెలుసని, తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని, తౌఫీక్కు నేహా రాఖీకూడా కట్టిందని తెలిపారు.