ప్రజావసరాలకే ప్రభుత్వ మిగులు
భూములు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా
కమిటీల ఏర్పాటు ఖమ్మం జిల్లా
ములుగుమాడు రెవెన్యూ సదస్సులో
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
పంద్రాగస్టు నాటికి భూసమస్యలు
అన్నింటికీ విముక్తి : మంత్రి పొంగులేటి
నాట్లకు ముందే రైతుభరోసా నిధుల
జమ : మంత్రి తుమ్మల
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో మళ్ళీ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తామ ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క ప్రకటించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా, మధిర సెగ్మెంట్లోని ఎర్రపాలెం మండలం, ములుగుమాడు గ్రామంలో భూ భారతి సర్వేతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమా న్ని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రా వు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సిసిఎల్ఏ నవీన్ మిట్టల్, సర్వే సెటిల్మెంట్ ల్యాం డ్ రికార్డ్స్ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్తో కలిసి ఆయన పారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మల్లు భట్టి మాట్లాడు తూ..ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన మి గులు భూములు ఉంటే వాటిని తిరిగి వెనక్కి తీసుకొని ప్రజా వినియోగం కోసం ఉపయోగించుకునేలా అసైన్మెంట్ కమిటీలను మళ్లీ ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.
భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26 లక్షల ఎకరాల భూమిని పేదలకు అసైన్డ్ చేస్తూ పం పిణీ చేశారని, ధరణిలో ఈ భూములను పార్ట్ బిలో పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేశార ని, భవిష్యత్తులో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి మిగులు భూ ములతో భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అర్హులకు భూ భారతి చట్టం ద్వారా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. దేశానికే తలమానికం గా అత్యంత పారదర్శకమైనభూ భారతి రెవె న్యూ చట్టాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించిందని, పేద ప్రజలకు ఇది చుట్టంగా పనిచేస్తుందన్నారు. దేశ చరిత్రలో చాలా అరుదుగా భూ భారతి వంటి అద్భుతమైన చట్టాలు వస్తాయని అన్నారు. నక్షాలు లేకుండా రాష్ట్రంలోని 413 గ్రామాలలో దశాబ్దాల కాలంగా పాలన సాగుతోందని, ఈ 413 గ్రామాల ప్రజలకు భూ భారతి చట్టిం ద్వారా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్వే చేయించి సరిహద్దులను నిర్ణయించి ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద ములుగుమాడు గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు.
పంద్రాగస్టునాటికి భూ సమస్యలన్నింటికీ విముక్తి : పొంగులేటి
దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తామని, భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపి రైతుల భూములకు భద్రత కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఆలోచనను ప్రజలపై రుద్దడం తమ ప్రభుత్వ విధానం కాదని, ప్రజల ఆలోచనలనే అమలు చేసే ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు వరకు పేదలకు పంచిందని, అటువంటి భూములను ధరణితో పేరుతో లక్షలాది ఎకరాలను తారుమూరు చేశారని,
వీటిలో జరిగిన అక్రమాలను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తామని, అసైన్డ్ భూ హక్కుదారులకు కూడా పూర్తి హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మనుషులకు ఆధార్లాగే భూములకు త్వరలో భూధార్ తీసుకువస్తామని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తా మని చెప్పారు. ప్రైవేట్ వ్యవస్థలో మొదటి విడత క్రింద రాష్ట్రంలో 6 వేల మంది సర్వేయర్లకు శిక్షణ అందించి వారికి లైసెన్స్ జారీ చేస్తున్నామని అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 556 మంది రెవెన్యూ అధికారులను రాబోయే నాలుగు రోజులలో నియమిస్తున్నట్లు తెలిపారు.
నాట్లకు ముందే రైతు భరోసా జమ : తుమ్మల
ఈ వర్షాకాలంలో నాట్లకు ముందే రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లల్లో ప్రభుత్వ సాయాన్ని జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. సాధారణంగా భూముల జోలికి వెళ్లేందుకు పాలకులు భయపడతారని, కానీ సిఎం రేవంత్ మాత్రం ధైర్యంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని సాహసోపేతంగా తీసుకువచ్చారన్నారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎంఎల్ఎ మాలోతు రాందాస్ నాయక్, డిసిసిబి ఛైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జెడి ప్రసన్న లక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఆర్డిఒ నర్సింహారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, ఎర్రుపాలెం తహసీల్దార్ ఉషా శారద, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.