జిల్లాలోని వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవుదినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూలైన్లో బారులు తీరారు. కోడె మొక్కు చెల్లించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలతో క్యూలైన్లో గంటలకుకొద్దీ వేచి ఉండడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ సేద తీరేందుకు నెత్తిన కొంగు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మహిళా భక్తులు వాపోయారు.
మరోవైపు తాగునీరు కూడా అందకపోవడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థల పాలయ్యారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు కోడెమొక్కు చెల్లించుకున్న భక్తులను ఆంజనేయస్వామి గేటు వద్ద నుండి లోనికి అనుమతిస్తుండగా ఒక్కసారిగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. రాజన్న ఆలయం మూసివేస్తారన్న ప్రచారంతో ప్రతినిత్యం 20 వేలకు పైగా భక్తులు స్వామివారి సన్నిధికి తరలివస్తుండగా ఆలయ పరిసరాలు కూడా కిటకిటలాడాయి.