ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ
12 గ్రామాల ప్రజలు, రైతుల
ఆందోళన ఫ్యాక్టరీ కంటెయినర్కు
నిప్పు, వాహనాలు ధ్వంసం కంపెనీ
సిబ్బందిని తరిమికొట్టిన జనం
పెద్దధన్వాడలో ఉద్రిక్తత
మనతెలంగాణ/గద్వాలప్రతినిధి: జోగులాం బ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవ ర్గం, రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యా క్టరీ నిర్మాణంపై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. బుధవారం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద ధన్వాడతో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున చేరుకుని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకువచ్చిన టిప్పర్లు, బొలెరో వాహనాలను ధ్వంసం చే శారు. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలకు నిప్పు పెట్టారు. అదేవిధంగా అక్కడ ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న కంటైనర్లకు కూడా నిప్పంటించారు.పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్ద ని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడతో పాటు మ రికొన్ని గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చే స్తూ వచ్చారు. దాదాపు 3 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. రాజోలి తహశీల్దార్ సమక్షంలో కంపెనీ యాజమాన్యం, గ్రామస్థులతో మీటింగ్ నిర్వహించినపుడు కూడా 12 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆర్డిఓతో పాటు డిఎస్పి కంపెనీ యాజమాన్యం, ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితితో గతంలో ఆర్డిఓ కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు. అప్పుడు కూడా ఆయా గ్రామాల ప్రజలంతా ఏకతాటిపై ఉండి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కంపెనీ నిలిపివేసింది.
పనులు ప్రారంభించేందుకు అర్ధరాత్రి సామగ్రి తరలింపు :
గ్రామస్థులంతా ముక్తకంఠంతో ప్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇథనాల్ కంపెనీ యాజమాన్యం మాత్రం సోమవారం అర్ధరాత్రి పనులు ప్రారంభించేందుకు కంటైనర్లు, జెసిబిలు, హిటాచీలు, బొలెరో వాహనాలు, టిప్పర్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం దగ్గర ఉంచింది. ఈ విషయం కాస్త 12 గ్రామాల ప్రజలతో పాటు ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీకి తెలియడంతో మంగళవారం రోడ్డెక్కి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఉదయమే ఆకస్మాత్తుగా అన్ని గ్రామాల ప్రజలంతా ఏకతాటిపై కొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రిని ధ్వంసం చేశారు. గుడిసెలకు, కంటైనర్లకు నిప్పుపెట్టారు. టిప్పర్లు, బొలెరో వెహికల్స్ ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని తరిమికొట్టారు. ఒకసారి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం దగ్గర విధ్వంసం సృష్టించారు.
విషం చిమ్మే ఫ్యాక్టరీ మాకొద్దు
పచ్చని పంట పొలాల మధ్య విషం చిమ్మే ఫ్యాక్టరీ తమకు వద్దంటూ రైతులు, ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని చెప్పి దాదాపు రెండేళ్ల నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు. అయినా వినకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి పట్టుదలకు పోయి తమ గ్రామాలు, పొలాలపైకి విషం చిమ్మాలని చూస్తోందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే 12 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, పచ్చని పంట పొలాలు బీడువారిపోతాయని, ప్రజలు క్యాన్సర్, తదితర రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరగనివ్వబోమని తేల్చిచెప్పారు.
పోలీస్ పికెట్ ఏర్పాటు
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మండిపడిన జనం విధ్వంసం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న ప్రజలను చెల్లాచెదురు చేసి పరిస్థితి చేయిజారిపోకుండా అదుపులోకి తెచ్చారు. జిల్లా ఎస్పి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి గొడవలు, విధ్వంసం జరుగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.