హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో సినీ పరిశ్రమ తీరుపై ఎఫ్ డిసి ఛైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయిందని తెలిపారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడారు. ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే అందరూ హాజరై తీసుకోవాలని సూచించారు. అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ అవార్డు కోసం సమయం కేటాయించాలన్నారు. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని ఎఫ్డిసి ఛైర్మన్ దిల్ రాజు కోరారు.
2024 సినిమాలకే ఇవ్వాలని ప్లాన్ చేశామని, కానీ 2014 నుంచి ఇప్పటివరకు అవార్డులు ఇవ్వకపోవడంతో గత పది సంవత్సరాలకు సంబంధించిన సినిమాలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇచ్చేందుకు కమిటీ నిర్ణయం తీసుకుందని దిల్ రాజు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న వారు చాలా సంతోషంగా ఉన్నారని, గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కోసం మార్గనిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.