మలయాళంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించి దృశ్యం సినిమాల సిరీస్ అటు మలయాళంలోనే కాదు.. ఇటు తెలుగు, హిందీలో కూడా మంచి సక్సెస్ సాధించాయి. మలయాళంలో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించగా.. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవ్గన్ నటించారు. ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలు జనానికి తెగ నచ్చేశాయి. దీంతో మూడో భాగం (Drishyam-3) ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకండా హిందీలో అజయ్ దేవ్గన్ దృశ్యం-3ని తెరకెక్కిస్తారని ప్రకటించడంతో ఇటు మలయాళంలో, అంటూ హిందీలో ఈ సినిమా వేర్వేరు కథలతో వస్తుందని అంతా భావించారు. కానీ, తాజాగా ఈ విషయంపై జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీతూ మాట్లాడుతూ.. ‘‘వేరొక కథతో హిందీ వెర్షన్ దృశ్యం-3 (Drishyam-3) వస్తుందనే వార్తలు అవాస్తవం. నేను అందించిన కథతోనే అది తెరకెక్కుతుంది. స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ఒకసారి స్క్రిప్ట్ సిద్ధమైతే.. హిందీ మూవీ టీమ్కు పంపిస్తా.. అక్కడి కల్చర్, పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు కొన్ని మార్పులు చేసుకుంటారు’’ అని పేర్కొన్నారు. అయితే తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకసారి షూటింగ్ చేయలేకపోయినా.. సినిమాల విడుదలను మాత్రం ఒకేసారి చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒటిటిల కాలం నడుస్తున్న నేపథ్యంలో వేర్వేరుగా విడుదల చేస్తే.. ఇతర భాషల్లో సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.