పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలని అనిపించింది. మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల చాలా బలమైన స్త్రీ పాత్రల మధ్య పెరిగాను. ఎప్పటినుంచో ఆ దృక్కోణం ఉంది. ఈ ఫిల్మ్ తో ఒక పూర్ణస్థాయి తీసుకోవాలనిపించింది. నేను రాసుకున్న పాత్రకు అనంతిక సరిగ్గా సరిపోయింది. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. తనకి మార్షల్ ఆర్ట్ వచ్చు. శుద్ధి అయోధ్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన హుందాతనాన్ని కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆమె నిలదొక్కుకుంటుంది. ప్రేమ రెండు దశల్లో జరుగుతుంది. 19 ఏళ్లలో జరిగే ప్రేమ, 27 ఏళ్ల వయసులో జరిగే ప్రేమలో తనలో మానసికంగా ఉన్న తేడాను చాలా సున్నితంగా చూపించాలని అనుకున్నాను. హీరోయిన్ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మృదుత్వాన్ని కోల్పోదు. ఈ సినిమాను కాశ్మీర్, కన్యాకుమారి, ఊటీ, ఆగ్రా.. ఇలా చాలా అద్భుతమైన లోకేషన్స్లో షూట్ చేశాం. కథే సినిమాను అక్కడికి తీసుకెళ్లింది”అని అన్నారు.