అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఉండాలి
సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి బేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ సిఎం క్యాంప్ ఆఫీసులో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సినీ నిర్మాతలు, దర్శకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని, సజినిమా పరిశ్రమలో పని వాతావరణం ఇంకా బాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సినీపరిశ్రమ లో వివాదం ఉండరాదనే అభిప్రాయంతోనే కార్మికుల సమ్మె విరమణకు తాను చొరవ తీసుకున్నట్లు చెప్పారు. తెలుగు సినిమారంగ కార్మికులను కూడా తాను పిలిచి మాట్లాడుతానని తెలిపారు. సినీపరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సినీపరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాలను పెంపుదల కోసం ప్రత్యేకంగా ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పరిశ్రమ లో నిర్మాతలు, కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరమని, అయితే కార్మికుల విషయంలో నిర్మాతలు మానవతాధృక్పదంతో వ్యవహరించాలన్నారు. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని తెలిపారు. సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరమని, పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామన్నారు. సినీపరిశ్రమలో వ్యవస్థలను ఎవరైనా నియంత్రిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే సినీ పరిశ్రమలోని వారందరూ చట్ట పరిధి లో పని చేయాల్సిందేన్నారు. పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని, తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో ఉంచడమే తన ధ్యేయం అని సిఎం అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము.. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు ఉన్నారు.