Thursday, June 12, 2025

సదరం సర్టిఫికెట్ల జారీకి అంగవైకల్య పరీక్షలు: సీతక్క

- Advertisement -
- Advertisement -

సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది
: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.10 లక్షల చొప్పున మొత్తం 3.8 కోట్లను విడుదల చేశామని తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగా అర్హులు చాలామంది నష్టపోయారని తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ సీతక్క గత అనుభవాల దృష్టిలో దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటి సారి వర్క్ షాపును నిర్వహిస్తున్నామని అన్నారు. ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉందనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుందని అన్నారు. ఈ సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

చేయూత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని వివరించారు. అందుకే డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. దివ్యాంగులకు ఆత్మగౌరవం దక్కాలంటే డాక్టర్లు పక్కాగా పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సదరం డైరెక్టర్ సాయి కిషోర్, న్యూ ఢిల్లీ ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లోని పలు విభాగాధిపతులు, స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News