గిరిజన వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని క్రీడా ఆశ్రమ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ …ఇందిరాగాంధీ పాలనలో గిరిజనుల అభివృద్ధికి సుమారు 25 లక్షల అసైన్డ్ భూములను పంపిణీ చేశారని తెలిపారు.ఆ భూములను ధరణి పేరుతో బిఆర్ఎస్ నాయకులు స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. భూ భారతి చట్టం ద్వారా ఆ భూములను సర్వే చేసి మళ్లీ గిరిజనులకు స్వాధీనం చేస్తామని అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధ్ది కోసం కాంగ్రెస్ కొత్త విధానాలతో పథకాలను ప్రవేశ పెడుతున్నదని పేర్కొన్నారు.
ప్రజల, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూ భారతిని అమలు చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. గిరిజన ప్రజల హక్కులపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గిరిజన బిడ్డ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముందుగా ఏఐసిసి సభ్యురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పాఠశాల ఆవరణంలో పిచ్చిమొక్కలను తొలగించి శ్రమదానం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపిలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, పినపాక, అశ్వారావుపేట, డోర్నకల్ ఎంఎల్ఎలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, డాక్టర్ జాటోత్ రాంచందర్నాయక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.