మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని చెరువులు, జలాశయాల్లో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. జూలై నెలాఖరు నాటికి రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని చెరువులు, జలాశయాల్లో చేపపిల్లలను వదలాల్సి ఉంది. పాత బకాయిలు ఇప్పిస్తేనే చేప పిల్లలు సరఫరా చేస్తామని వ్యాపారవర్గాలు చెబుతుండగా, చేపపిల్లల కొనుగోలు అయ్యే నిధులను నేరుగా మత్య సహకార సొసైటీల ఖాతాలకే ప్రభుత్వం జమచేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ప్రభుత్వానికి సూచిస్తున్నా యి. ఈ మేరకు మత్స సహకార సంఘాల్లో తీర్మానాలు చేసి ఆ కాపీలను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో చేపపిల్లల కొనుగోలులో జరిగిన అవకతవకల కారణంగా మత్స సహకార సంఘాల సభ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.
మత్సకారులు తీవ్రంగా నష్టపోయారని మత్స సహకార సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది చేపపిల్లలు కొనుగోలు చేసినట్లుగా చెప్పారు కానీ, చె రువుల్లో చేపపిల్లలు పోసేటప్పుడు తమకు వాటి లెక్కలు చూపలేదని మత్స సహకార సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆనాడు వారి మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వల్ల చెరువుల్లో చేప సంపద పెరగలేదనేది అందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. చెరువులపై ఆధారపడి చేపలవేట వృత్తిని ఆధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న బెస్త, గంగపుత్రులకు ఉచిత చేపపిల్లల పథకం వల్ల ఒరిగిందేమీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఉచిత చేపపిల్లల పథకం కింద చేపల వ్యాపారులకు కొనుగోలు కోసం ఇచ్చే డబ్బులను నేరుగా తమ ప్రాథమిక మత్స సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లయితే నేరుగా సోసైటీలు చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో పెంచుకోవడం ద్వారా అవినీతి అక్రమాలకు ఆస్కారం ఉండదని సూచిస్తున్నారు.
బకాయిలు ఇస్తేనే పనిచేస్తాం
గత రెండు ఆర్ధిక సంవత్సరాల పాటు మత్యశాఖ కొనుగోలు చేసిన చేపపిల్లల బకాయిలు ఇస్తే తప్ప తాము చేపపిల్లలు ఇచ్చేదిలేదని వ్యాపారులు ఏకతాటిపై ఉన్నారు. ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం అతడి బకాయిలను చెల్లించింది. దాంతో మిగతా చేపల చెరువుల వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. జూలై నెలాఖరులోగా రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని చెరువులు,జలాశయాల్లో చేపపిల్లలను వదలాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రత్యామ్నాయం లేక ఇటీవల మత్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేపల చెరువుల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. బకాయి బిల్లులను ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని, కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున తనకు సహకరించాలని మంత్రి శ్రీహరి చేపల చెరువుల వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. చేప పిల్లల సరఫరాకు తమకు కూడా కొంత పెట్టుబడుల ఖర్చులు అవసరమని, రెండేళ్లుగా దాదాపు రూ.94కోట్ల మేరకు ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడం వల్ల అప్పులపాలై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు వారు మంత్రి శ్రీహరికి వివరించారు.