ఆ వార్తల్లో నిజం లేదు
కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) లో తాను వాటాలు కొనుగో లు చేయనున్నట్టు వస్తున్న వార్తలను కర్నాటక ఉప ము ఖ్యమంత్రి డికె శివకుమార్ ఖండించారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ సీజన్ 2025లో ఆర్సిబి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న కల సాకారం కావడంతో ప్రస్తుతం ఆర్సిబి బ్రాండ్ విలువ అనూహ్యంగా పెరిగిపోయింది.
ఇలాంటి స్థితిలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్సిబి ఫ్రాంచైజీ యాజమానిగా ఉన్న డియాజియో కంపెనీ కొంత వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది. దీంతో పలువురు పెట్టుబడిదారులు ఆర్సిబి వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని తెలిసింది. ఇందులో డికె శివకుమార్ పేరు కూడా వినిపించింది. కానీ ఈ వార్తలను ఆయన ఖండించారు. ఆర్సిబి వాటాను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియాలో వచ్చిన అన్ని వార్తలు నిరాధారమైనవని డికె శివకుమార్ కొట్టి పారేశారు.