బెంగుళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సిఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని.. డికె శివకుమార్ ను అరెస్టు చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో స్పందించిన శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. “తొక్కిసలాట ఘటనలో చిన్న పిల్లలు కూడా చనిపోవడం బాధగా ఉంది. 10 మంది నా కళ్లెదుటే ప్రాణాలు వదిలారు. వాళ్ల బాధను కళ్లారా చూశాను. ఏ కుటుంబం కూడా ఇంతటి విషాదాన్ని జీర్ణించుకోలేదు. మనం దీన్నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది” అని శివకుమార్ వమోషనల్ అయ్యారు.