Tuesday, August 12, 2025

వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

- Advertisement -
- Advertisement -

వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో శిశువు పురిటిలోనే మృతి చెందిందంటూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట మండలం, యాదగిరిపలికి చెందిన తేజస్విని చెకప్ కోసం జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ మెటర్నిటీ ఆసుపత్రికి వచ్చింది. మంగళవారం ఆమె ఆసుపత్రికి రావడంతో వైద్యులు లేకపోవడంతో నర్సులే వైద్యులుగా మారి వాట్సాప్ ద్వారా వైద్యుల సలహాలు తీసుకుంటూ ఇంజెక్షన్ చేశారు. అయితే, ఇంజెక్షన్ వికటించి నవజాత శిశువు మృతి చెందింది. కాగా, శిశువు మృతి చెంది, తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ఏడు నెలల గర్భిణి ఇబ్బందులు పడుతోందని తెలిసి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు పట్టించుకోకుండా ఇంజెక్షన్ చేశారని.. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆందోళన తీవ్రతరం కావడంతో భువనగిరి పట్టణ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులకు నచ్చజెప్పినా విరమించకపోవడంతో ఓ ల్యాబ్ నిర్వాహకుడు ఆసుపత్రి యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయం స్థానికంగా తెలిసింది. కొంతమంది వైద్య అధికారులు కీలకంగా సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నవజాత శిశువు మృతికి రూ. లక్ష పరిహారం ఇచ్చేందుకు ఆసుపత్రి నిర్వాహకులతో ఒప్పందం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై భువనగిరి పట్టణ పోలీసు ఉన్నతాధికారులను ’మన తెలంగాణ’ ప్రతినిధి సంప్రదించగా తమకు ఫిర్యాదు వచ్చిన కొద్దిసేపటి తరువాత పిర్యాదు వాపసు తీసుకున్నారని సిఐ రమేష్ తెలిపారు. శిశువు మృతికి కారణం.. సెటిల్మెంట్ విషయమై నిఘా సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News