భారత్-పాక్ల మధ్య అణు యుద్ధాన్నితానే ఆపానని ఇప్పటికే చాలసార్లు చెప్పుకొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్లోని హేగ్లో నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం జరిగింది. అందుల్లో పాల్గొన్న అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధాలన్నీ నే ఆపానంటూ చెప్పుకొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల గురించి కూడా ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు. అయితే వాటిలో అన్నికన్నా ముఖ్యమైనది భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలని వ్యాఖ్యానించారు.‘ నేను వరస ఫోన్కాల్స్తో ఆ యుద్ధం ముగించాను. మీరు ఒకరితో ఒకరు పోరాడితే మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోబోమని వారికి స్పష్టంగా చెప్పాను. భారత ప్రధాని మోడీ నాకు గొప్ప స్నేహితుడు.
పాక్ జనరల్ ఆకట్టుకునే వ్యక్తి. వారు కూడా వాణిజ్యమే కావాలన్నారు. అలా మేము అణు యుద్ధాన్ని ఆపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని ప్రధాని మోడీ ఇటీవల తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇది రెండు దేశాల సైన్యాలు చర్చించి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు.ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్లో చెప్పానని కూడా ప్రధాని తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ సైతంఈ ఒప్పందంలో తన జోక్యం ఏదీ లేదని, ఆ రెండు దేశాలే చర్చించి ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పడం గమనార్హం. అయినా మరోసారి ట్రంప్ పాతపాటే పాడడం గమనార్హం.