మరింత జాప్యం చేయకుండా తక్షణమే అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బెదిరింపుతో కూడీన హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులకు తెగబడి, సీనియర్ సైనికాధికారులను, శాస్త్రవేత్తలను హతమార్చిన కొద్ది గంటలలోనే ట్రంప్ ఇరాన్ కు ఈ హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ దాడులు, ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ ల దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్ తక్షణమే అణు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అంగీకరించని పక్షంలో ఈ సారిదాడులు మరింత ఉధృతంగా సాగుతాయని ట్రంప్
స్పష్టం చేశారు. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ కు తాను మళ్లీ ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తున్నానని అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో తెలిపారు.ఇపాన్ ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది, చాలా విధ్వంసం జరిగింది. ఇక తొందరపడి వారు అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలి లేని పక్షంలో ఈసారి దాడులు వారు ఊహించనంత తీవ్రాతితీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
ఇప్పటికీ వారికి అవకాశం ఉందని ఆయన అన్నారు.ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖుమేనీ ఇజ్రాయెల్ కు కఠిన శిక్ష విధిస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేసిన తర్వాత ట్రంప్ ఈ విధమైన హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ సైనిక విమానాలు, క్షిపణులతో ఇరాన్ అణుశక్తి కేంద్రాలు, యురేనియం శుద్ధి కేంద్రాలపై జరిపిన దాడిలో ఇరాన్ ఆర్మీచీఫ్ మొహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ -ఇన్ చీఫ్ హుస్సేన్ సలామి తో పాటు ఆరుగురు
అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.ఇజ్రాయెల్ దాదాపు 200 ఫైటర్ జెట్ లను వినియోగించడంతో పాటు, ఇరాన్ తన అణుశక్తి కార్యకలాపాలకు స్వస్తి చెప్పని పక్షంలో తమ దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ అణాయుధ కార్యక్రమం విషయంలో తక్షణం స్పందించాలని ఐక్యరాజ్యసమితిని కోరుతూ, ఇజ్రాయెల్
విదేశాంగమంత్రి ఓ లేఖ రాశారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ఇరాన్ పై జరుపుతున్న దాడులతో తమకు సంబంధం లేదని,, తమ పాత్ర కూడా లేదని అమెరికా ప్రెసిడెంట్ తెలిపారు. అయితే ఈ పరిణామాలు
తనకు తెలుసునని ఫాక్స్ న్యూస్ కు వివరించారు.