నగరంలో మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసుల సోదాలు
రూ.11.58కోట్లు విలువైన డ్రగ్స్ ముడిసరుకులు స్వాధీనం
13మందిని అరెస్టు చేసిన పోలీసులు
మనతెలంగాణ/చర్లపల్లి, సిటిబ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుకు సంబందించి మూలాలు నగరంలో బయటపడ్డాయి. మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం నగరంలోని చర్లపల్లిలోని డ్రగ్స్ తయారీ యూనిట్పై దాడి చేసి తనిఖీలు నిర్వహించడం తీవ్ర కలకలం సృష్టించింది. సోదాల్లో పోలీసులు రూ.11.58కోట్ల విలువైన డ్రగ్స్ ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీల్లో 5.790 కిలోల ఎమ్డి మందులు, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల పౌడర్, ఔషధాల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు 13మందిని అరెస్టు చేశారు.
పోలీసులు కథనం ప్రకారం…నగరంలోని రాంనగర్ గుండుకు చెందిన ఒలేటి శ్రీనివాస్ విజయ్, తనాజీరావు గతంలో జివికె ల్యాబరేటరీలో పనిచేశారు. ఉద్యోగం మానివేసిన తర్వాత నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లోని చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయనగర్ , నాచారం పారిశ్రామికవాడలో షెడ్డులను అద్దెకు తీసుకుని వాక్దేవి ల్యాబరేటరీ పేరుతో పరిశ్రమలను ఏర్పాటు చేశారు. చర్లపల్లి, నవోదయనగర్లోని పరిశ్రమలో డ్రగ్స్లో వినియోగించే రామెటీరియల్ తయారు చేసి, నాచారం పారిశ్రామికవాడలోని ల్యాబ్లో డ్రగ్స్ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన మెఫ్డ్రోన్ డ్రగ్స్ను ముంబాయి, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లకు విక్రయిస్తున్నారు. గత నెల 8వ తేదీన క్రైం బ్రాంచ్ పోలీసులు బంగ్లాదేశ్కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా (23) అనే మహిళ వద్ద నుంచి 105 గ్రాముల ఎండి (మెఫెడ్రోన్) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి విచారించగా పదిమంది వ్యక్తుల పేర్లు బయటికి రావడంతో వారిని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి 178 గ్రాముల ఎండి డ్రగ్స్, రూ.2.97లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కస్టడీకి తీసుకున్న ముంబాయి క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించగా తమకు డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్నట్లు బయటపెట్టారు. దీంతో పోలీస్ ఇన్స్స్పెక్టర్ ప్రమోద్ బదఖ్ ఆధ్వర్యంలో నగరానికి వచ్చి పోలీసుల బృందం చర్లపల్లి, నాచారంలో తనిఖీలు నిర్వహించారు. గత రెండు రోజులుగా చర్లపల్లి నవోదయనగర్లో, నాచారం పారిశ్రామికవాడలో విచారణ చేసిన పోలీసులు ముంబాయి థానేలో 11 మందిని, చర్లపల్లి, నవోదయనగర్లో విజయ్ శ్రీనివాస్, నాచారంలో తనాజీరావును అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపర్చి ముంబాయికి తరలించారు. అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించనున్నట్లు మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.