పుట్టిన రోజు వేడుకల పేరిట ఐటి ఉద్యోగుల హంగామా
రెండు లక్షల విలువగల డ్రగ్స్ పట్టివేత
రూ.50 లక్షల విలువ చేసే మూడు కార్లు స్వాధీనం
ఆరుగురు ఐటి ఉద్యోగులు అరెస్ట్.. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కేసు
మన తెలంగాణ/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ శివారు ప్రాంతంలోని ఓ రిసార్ట్లో ఫామ్హౌస్లో ఆదివారం డ్రగ్స్ కలకలం రేపింది. పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నామని చెప్పి ఖరీదైన మద్యం, డ్రగ్స్ను సేవించారు. వివరాల్లోకి వెళ్తే..తాము ఐటి ఉద్యోగులమని, పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటామని చెప్పి మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి శివారులో గల సెరీన్ ఆచార్డ్ ఫామ్హౌస్లో రిసార్ట్ను బుక్ చేసుకున్నారు. ఐటి ఉద్యోగుల్లో ఒకరైన అభిజిత్ బెనర్జీది పుట్టిన రోజు సందర్భంగా ఆరుగురు ఉద్యోగులు ఆదివారం రిసార్ట్కు చేరుకున్నారు. వీరంతా డెల్ అనే ప్రైవేట్ ఐటి కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా రిసార్ట్కు ఖరీదైన కార్లలో వచ్చి విలువైన మద్యం తీసుకువచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ను కూడా వెంట తీసుకువచ్చి సేవిస్తున్నారు. ఐదు మద్యం బాటిళ్లతో పాటు 0.5 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఎల్ఎస్డి బ్లాస్ట్, మరో 20.21. గ్రాముల డ్రగ్స్ను సేవిస్తూ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్జిఎఫ్బి టీం సిఐ భిక్షపతి, ఎస్ఐ బాల్రాజ్ తమ సిబ్బందితో కలిసి ఫామ్హౌస్పై దాడి చేశారు.
ఈ దాడిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడున్న వారందరికీ డ్రగ్ కిట్తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఐటి ఉద్యోగులు వినియోగిస్తున్న రూ.50 లక్షల విలువ గల మూడు కార్లను, ఐదు సెల్ఫోన్లు, ఖరీదైన 5 మద్యం బాటిళ్లు, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్ బెనర్జీ, డింపుల్, ప్రతాప్, గోయెల్, జస్వంత్, దినేష్లతో పాటు ఫామ్హౌస్ యాజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వీరందరిని చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ పార్టీని ఫామ్హౌస్లో విఫలం చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం ఎస్జిఎఫ్బి టీం బృందాన్ని అభినందించారు.