Friday, July 18, 2025

మద్యం కుంభకోణం కేసు.. మాజీ సిఎం కుమారుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఉదయం బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు, అనంతరం చైతన్యను కస్టడీ లోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ , మద్యం సిండికేట్‌కు రూ. రెండువేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ , శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లా లోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకొని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బర్త్‌డే రోజు మంచి గిఫ్ట్: భూపేశ్ బఘేల్
ఇదిలా ఉండగా పుట్టిన రోజు నాడే చైతన్యను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. దీనిపై ఆయన తండ్రి భూపేశ్ స్పందించారు. “రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు నేడు చివరిరోజు. అదానీ సంస్థ కోసం చెట్లు కూలుస్తున్న అంశాన్ని మేం లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. నా కుమారుడి పుట్టిన రోజున మంచి బహుమతి ఇచ్చారు ” అని మాజీ సీఎం మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News