ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ను శుక్రవారం ఇడి అధికారులు విచారించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణకు రావాలని అధికారులు కోరడంతో శుక్రవారం అల్లు అరవింద్ ఇడి విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ స్కామ్లో అధికారులు సుమారు అల్లు అరవింద్ను మూడు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో 2018,19 సంవత్సరాల మధ్యకాలంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి ఉపయోగించినట్లు ఇడి గుర్తించింది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని భావించి ఇడి విచారణ చేపట్టింది. ఈ విచారణలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు, అల్లు అరవింద్కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్దిక లావాదేవీలు జరిగినట్లు ఇడి అధికారులు గుర్తించారు.
అల్లు అరవింద్ను విచారించిన అధికారులు బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, 2024 సంవత్సరంలో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహించి రూ. 1.45 కోట్లను సీజ్ చేసింది. నింధితులు రూ. 101.48 కోట్ల రుణాలకు సంబంధించిన నిధులు మోసపూరితంగా మళ్లించారన్న ఆరోపణలకు నేపథ్యంలో ఇడి దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రధానంగా బ్యాంకు యాజమాన్యం ఆర్బిఐ నింబధనలు ఉల్లంఘించి రూ. 100 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై ఇడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ను ఇడి అధికారులు విచారించడం సినీ వర్గాలో చర్చనీయాంశంగా మారింది.