Tuesday, June 24, 2025

ఉత్తీర్ణత మెరుగు.. నైపుణ్యాల తరుగు

- Advertisement -
- Advertisement -

విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం; పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం అంటే, విద్య వినయాన్ని ఇస్తుంది, వినయంతో వ్యక్తి పాత్రత (యోగ్యత) పొందుతాడు. పాత్రత వలన ధనం వస్తుంది; ధనంతో ధర్మం, ధర్మంతో చివరికి సుఖం లభిస్తుంది. ఇంతటి విశిష్టతను కలిగిన విద్య భగవంతుడు మనిషికి ప్రసాదించిన గొప్ప జ్ఞానసంపద. విద్య ఒక దేశ మానవ వనరుల నిర్మాణ సాధనం మాత్రమే కాదు, ఆ దేశ సంస్కృతి, సమాజ నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి ఆధారంగా నిలిచే మూలస్తంభం కూడా. విద్య విద్యార్థులను పట్టభద్రులుగా తయారుచేసే ప్రక్రియ మాత్రమే కాదు, శాస్త్ర జ్ఞానంతోపాటు విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా, నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది పటిష్టమైన దేశనిర్మాణంలో కీలకపాత్రను పోషించే జ్ఞానభాండాగారం కూడా. విద్య పాఠ్యపుస్తకాల పఠనంతో ముగిసే అభ్యాసం మాత్రమే కాదు, ఆలోచనాశక్తిని వికసింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదించి, సరైన జీవనమార్గాన్ని ఉపదేశించే గొప్ప మార్గదర్శి.

భారతదేశానికి విద్యతో ఉన్న అనుబంధం చారిత్రికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా చాలా అపారమైనది. భారతీయ జ్ఞానసంపద ప్రాచీన కాలంలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో విస్తరించి ఉండేది. అనాదిగా భారతదేశం జ్ఞానభూమి, విద్యాక్షేత్రంగా (academic field) ప్రఖ్యాతి గాంచింది. ‘సర్వేపి విద్యా సర్వత్ర గమ్యం’ అనే తత్త్వంతో, విద్యను కేవలం ఉపాధి సాధనంగా కాక, జీవన మౌలికంగా భావించిన దేశం భారతదేశం. అయితే, కాలక్రమేణ పాలనా విధానాల మార్పులు, సామాజిక పరిణామాలు, ప్రపంచీకరణ వంటి ప్రభావాలతో భారతీయ విద్యా విధానం ఎన్నో రూపాంతరాలు చెందుతూ వస్తున్నది. భారతీయ విద్యా వ్యవస్థకు మూలం గురుకుల పద్ధతి. ఇందులో విద్యార్థి గురువుతో నివసిస్తూ విజ్ఞానం, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం అనే మూడు మూలస్థంభాలపై విద్యను ఆచరణాత్మకంగా అభ్యసించేవాడు.

వేదాలు, ఉపనిషత్తులు, అర్థశాస్త్రం, ఖగోళశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి శాస్త్రాలు బోధించబడేవి. విద్యార్థులు క్రమశిక్షణ, ధ్యానం, సేవ, సత్యం వంటి విలువలతో విద్యను సమగ్రంగా అభ్యసించేవారు. ఇస్లామీయ పాలనలో మదర్సాలు ప్రధాన విద్యా కేంద్రాలుగా మారాయి. వీటిలో అరబిక్, ఫార్సీ భాషలతోపాటు ఇస్లామీయ ధర్మశాస్త్రాలు బోధించబడేవి. సాధారణ ప్రజలు విద్యలో పాల్గొనే అవకాశం తగ్గింది. ఖగోళ శాస్త్రం, వైద్యం, సాహిత్యం, కళల అభివృద్ధి కొనసాగింది. 1835లో మకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం భారతీయ విద్యను ప్రగాఢంగా ప్రభావితంచేసింది. ఉద్యోగాలకే విద్యను లక్ష్యంగా చేస్తూ, పాఠశాలలు, కళాశాలల ద్వారా పరీక్షల ఆధారిత వ్యవస్థ రూపొందించబడినది. జ్ఞానాన్ని మార్కుల రూపంలో అంచనా వేసే ధోరణి మొదలైంది. భారతీయ భాషలు, సంప్రదాయ పాఠ్యాంశాలు మరుగున పడి, ఇంగ్లీష్ మాధ్యమం ప్రాధాన్యతను సంతరించుకున్నది. గురుకులాల స్థానాన్ని పాఠశాలలు, కళాశాలలు ఆక్రమించాయి.

స్వాతంత్య్రానంతరం విద్య అందరికీ సమానంగా అందించాలనే దృష్టితో జాతీయ విద్యా విధానాలు (ఎన్‌ఇపి) ప్రవేశపెట్టబడ్డాయి. ప్రాథమిక హక్కులపై దృష్టి, స్థానిక భాషల్లో బోధన, నైతిక విలువల ప్రాధాన్యం, సాంకేతిక వినియోగం, వెనకబడిన వర్గాల పిల్లలకు ప్రోత్సాహం వంటి అంశాలు ఇందులో ప్రతిఫలించాయి. నేటి విద్యా విధానం కాలంతోపాటు వేగంగా మార్పు చెందుతున్నా, ఆ మార్పు దిశలో ఎన్నో నిగూఢ లోపాలు కనబడుతున్నాయి. విద్యకు మూలమైన జ్ఞానం, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసాలకు ప్రాధాన్యత తగ్గి, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలకే ప్రాధాన్యత పెరుగుతున్నది. విద్యార్థికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకూ కొనసాగే ఒకే ఒక్క దినచర్యగా విద్య మారడంతో విద్యార్థులు మానసికంగా, శారీరికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

విద్యార్థులు పాఠ్యాంశాన్ని ‘ఎందుకు నేర్చుకోవాలి?’ అన్న జిజ్ఞాస లేకుండా, కేవలం ఉత్తీర్ణత కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా మాత్రమే భావిస్తున్నందువల్ల సొంతంగా పరిశీలించటం, ఆలోచించటం, ఆచరించటం వంటి సామర్థ్యాలను క్రమంగా కోల్పోతున్నారు. ఉన్నత పాఠశాల నుండి ఇంటర్మీడియట్ వరకు బోధించే విద్యను విద్యార్థికి కీలకమైన దశగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ దశలో నేర్చుకునే పాఠ్యాంశాల్లోని ప్రాథమిక భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, భాషా వ్యాకరణం, వ్యక్తిత్వ వికాసం విద్యార్థి భవిష్యత్తు విద్యకు అత్యంత మూలాధారమైనవి. కానీ, ప్రాథమిక అంశాలను క్షుణంగా నేర్పకుండానే, కేవలం ఒక విషయాన్ని ఎక్కువ సార్లు గుడ్డిగా విద్యార్థులతో సాధన చేయించడం ద్వారా మార్కులు, ర్యాంకులు సాధించే విధానం ప్రస్తుతం కొనసాగుతున్నది. దీని ఫలితంగా ప్రాథమిక అంశాలపై అవగాహన లేని విద్యార్థులు ఉన్నత విద్యలో వెనుకబడిపోతున్నారు.

అలాగే, ఈ దశలో భాషా శాస్త్రాలకు సరైన ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వల్ల, భాషా పరీక్షల్లో నూరుశాతం మార్కులు సాధించిన విద్యార్థులు కూడా, వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడడం, వినడం, చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు విద్యకు, ఉద్యోగ సాధనకు పెద్ద లోపంగా మారుతున్నది. విద్యను గమ్యంగా కాక, నిరంతర ప్రయాణంగా చూడాలి. ఇది ఒక వయస్సుతో ముగిసే ప్రక్రియ కాదు. పరీక్షలు రాయడం, మార్కులు సాధించడం, డిగ్రీలు పొందడం విద్యలో ఒక భాగం మాత్రమే, ముగింపు కాదు. వాస్తవానికి విద్యాభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. అనుభవాల నుంచి నేర్చుకోవడం, కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరచడం, విలువల పట్ల అవగాహన పెంచుకోవడం విద్యాసాధనకు ఉత్తమ మార్గాలు. ఒకప్పుడు జ్ఞానసంపదను పంచే సరస్వతీ ఆలయాలుగా భావించబడిన విద్యాసంస్థలు నేడు లాభాపేక్షతో వ్యాపార సంస్థలుగా మారిపోయాయి అనడంలో అసత్యం లేదు.

శాస్త్ర జ్ఞానం, సాంకేతిక నైపుణ్యం, భాషా ప్రావీణ్యత, ఆచరణాత్మక సామర్థ్యం, సృజనాత్మకత, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలను, పాఠ్యాంశాలను రూపొందించి, వాటిని ఆచరణలోకి తీసుకురావాలి. విద్యాసంస్థలు తమ పాఠ్యప్రణాళికలలో వీటిని పొందుపరచడమే కాదు, విద్యార్థులు వాటిని కేవలం పరీక్షల కోసమేనని భావించకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా బోధనా పద్ధతులలో మార్పులు తీసుకురావాలి. విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ‘విద్య కేవలం ఉత్తీర్ణత కోసమే’ అన్న దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. ప్రతి విద్యార్థిని ఏదో రీతిలో ఉత్తీర్ణుడిని చేయాలన్న ఆలోచన నుంచి తన మేధస్సును ఉపయోగించి సాధన చేసిన విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించాలనే ఆలోచనకు అందరూ మారాలి. విద్యా దీపాన్ని జ్ఞానంతో ఒక్కసారి వెలిగిస్తే, అది జీవితాంతం వెలుగును ప్రసరిస్తుంది.

  • ననుబోలు రాజశేఖర్, 98857 39808
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News