ఏలూరు: జిల్లాలోని చొదిమెల్ల (Eluru Chodimalla) ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె లేని లోకంలో తాను జీవించలేనని.. భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చొదిమెల్లలో నివాసం ఉంటున్న చిన్న సురేంద్ర, దేవిక దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారికి ఇద్దరు కుమారులు. ఈ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దేవిక ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
భార్యకి ఫోన్ చేసిన సురేంద్ర ఆమె ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్య మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. భార్య లేని జీవితం తనకూ వద్దనుకొని చేతులు, కాళ్లు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పుట్టినరోజు మర్నాడే దేవిక ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఇంకా తెలియడం లేదు. దీన్ని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.