Wednesday, June 25, 2025

వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు

- Advertisement -
- Advertisement -

ఆ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు నిండుతున్న ఈ సమయంలో, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయి. మన రాజ్యాంగం, మన హక్కులను కిటికీ నుండి బయటకు విసిరివేసిన సమయం అది. అత్యవసర పరిస్థితి అంటే స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని నిలిపివేశారు. న్యాయమైన చట్టాలను విస్మరించారు. మనలాంటి సాధారణ ప్రజలు దాని బాధితులయ్యారు. జూన్ 25, 1975న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. పౌర స్వేచ్ఛలను నిలిపివేశారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టారు, మీడియాను సెన్సార్ చేశారు. భయాన్ని సంస్థాగతీకరించారు. మీసాతో సహా వివిధ క్రూరమైన చట్టాల కింద లక్ష మందిని పైగా అరెస్ట్ చేశారు. వారందరి ఏకైక ‘నేరం’ వారి ప్రజాస్వామ్య హక్కును వినమని కోరడం.

అయితే, అత్యవసర పరిస్థితి రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రారంభం కాదు. ఇది దాని అత్యంత నగ్నరూపం మాత్రమే. 1976లో, అత్యవసర పరిస్థితి సమయంలో, 40వ సవరణ ఈ చట్టం న్యాయ పరిశీలన నుండి తప్పించుకునేలా చేసింది. 1955లో, మొదటి సవరణ నిత్యావసర వస్తువుల చట్టం ఆమోదించిన వెంటనే, చాలామంది రైతులకు ప్రభుత్వం నుండి నోటీసులు అందాయి. తమ స్వంత పొలంలో పండించిన గోధుమలను సుమారు 30బస్తాలను నిల్వ చేసినందుకు హెచ్చరించారు. వాటిని నిల్వ చేయడానికి వారికి అనుమతి లేదని, వెంటనే విడుదల చేయకపోతే వాటిని జప్తు చేస్తామని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం నియంత్రణ పేరుతో స్వావలంబన, ఆహార భద్రతను నేరంగా పరిగణించడం ప్రారంభించినప్పుడు లెక్కలేనన్ని వ్యవసాయ కుటుంబాలు అనుభవించిన ద్రోహాన్ని ఆ క్షణంలో చిత్రీకరించారు. వ్యవసాయంలో ప్రస్తుత సంక్షోభం అక్కడి నుండే ఉద్భవించింది. దీనికి తోడుగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తొలగించారు. ఆర్టికల్ 31 కింద హామీ ఇచ్చిన ఈ హక్కును మొదట ఇందిరా గాంధీ హయాంలో బలహీనపరిచారు. కానీ చివరకు 1978లో 44వ సవరణ ద్వారా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే హామీపై అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం దీనిని తొలగించింది.

ఆర్టికల్ 300ఎ కింద దీనిని కేవలం చట్టపరమైన హక్కుగా తగ్గించారు. ఒకప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక గౌరవానికి కీలకమైన హక్కుగా ఉన్న దానిని ప్రభుత్వం సులభంగా అధిగమించగలిగే విధంగా కుదించారు. దీని అర్థం ఏకపక్ష భూసేకరణ, అధికార దుర్వినియోగం నుండి రక్షణలను బలహీనపరిచారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పుట్టకకు పునాది, ఆర్థికాభివృద్ధికి ఆలంబన అయినా ఆస్తిహక్కును తొలగించడం దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. నేడు కోర్టులలో ఉన్న వివాదాలలో 80 శాతంకు పైగా దాని ఫలితంగా వచ్చినవే. నేడు మనం అత్యవసర పరిస్థితిలో లేనప్పటికీ చాలా అద్భుతమైన సమాంతరాలు ఉన్నాయి. పౌర స్వేచ్ఛలు మళ్ళీ ఒత్తిడిలో ఉన్నాయి. ప్రభుత్వ విమర్శకులు దేశద్రోహ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఉపా వంటి ఉగ్రవాద నిరోధక చట్టాలను విచారణ లేకుండా అసమ్మతి వ్యక్తం చేసేవారిని నిర్బంధించడానికి ఉపయోగిస్తున్నారు. జర్నలిస్టులను నిత్యం వేధిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ నాయకులు, విప్లవ పార్టీలు చాలావరకు మౌనంగా ఉండిపోయినా సాధారణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రదర్శించిన అపూర్వమైన ధైర్యసాహసాలు భారతదేశ చరిత్ర గతినిమార్చాయి. నిర్బంధంతో, నిరంకుశత్వంతో అధికారాన్ని ఎవ్వరూ దీర్ఘకాలం కాపాడుకోలేరని గుణపాఠం నేర్పారు. అటువంటి గుణపాఠం నేర్చుకోవడానికి సిద్ధంకాని రాజకీయవేత్తలు ఎప్పటికైనా భారీ మూల్యం చెల్లింపకతప్పదు.

సాధారణ ప్రజలలోని ఆ ధైర్యసాహసాలు భారత ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలు. ఎమెర్జెన్సీకి ముందు మొత్తం దేశప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల స్ఫూర్తితో అవినీతి పాలకులకు వ్యతిరేకంగా మార్పుకోసం భావోద్వేగంతో రగిలిపోతున్న సమయం. అయితే, 1947లో స్వతంత్ర ఉద్యమానికి అటువంటి భావోద్వేగ స్ఫూర్తి కలిగించిన మహాత్మా గాంధీ వంటి నాయకుల బోధనలను అధికారంలోకి వచ్చిన నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులు ఏవిధంగా పెడచెవిన పెట్టారో, అదే విధంగా జనతా పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చిన పెద్దలు సైతం జయప్రకాశ్, ఆచార్య కృపాలాని వంటి పెద్దల హితబోధనాలను సైతం పట్టించుకోలేదు. దానితో అంతర్గత కుమ్ములాటలతో జనతా ప్రభుత్వం కుప్పకూలిపోక తప్పలేదు. నేడు దేశంలో దాదాపు అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలలో అప్పటి మాదిరిగా సైద్ధాంతిక పటుత్వం సడలిపోవడం, కేవలం అధికారంకోసం ఎటువంటి అడ్డదారినైనా అనుసరించేందుకు సిద్ధంగా ఉండడం, యువత వ్యామోహాల మోజులో పడిపోతూ ఉండడంతో ఒక విధంగా నిరాశాజనకమైన పరిస్థితులు నెలకొన్నాయి. పాలకులు ఈవెంట్ మేనేజర్లుగా మారిపోతూ పత్రికల శీర్షికల కోసమే తపనపడిపోతూ విధానపరమైన అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

విప్లవాత్మక చట్టాలు, విధానాలు ప్రకటించడమే గాని ఆచరణపట్ల ఆసక్తి చూపడంలేదు. 2020లో ఎంతో ఆర్భాటంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన విద్యావిధానం ప్రకటించిన రెండు రోజులకే జిడిపిలో 6% నిధులు విద్యకు కేటాయించకపోతే ఈ మొత్తం ప్రక్రియ వృథాగా మిగిలిపోతుందని నాటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ హెచ్చరించారు. ఆ విధానం ప్రధానంగా విద్యారంగంలో స్వతంత్రత కోసం అన్ని రకాల విద్యమండలాలను కలుపుతూ జాతీయ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. ఐదేళ్లయినా ఆ దిశలో ప్రయత్నాలు జరగడం లేదు. అన్ని రంగాలలో ఇటువంటి విధానపరమైన పక్షవాతం దేశాన్ని పట్టిపీడిస్తోంది. అయితే, దేశంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంగా భారత ప్రజలు రాజకీయ నాయకులకన్నా ఎంతో పరిణితి చెందినవారమని నిరూపించుకున్నారు. సవాళ్ళను అధిగమించేందుకు వివేకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఎందరో పాలకులను గద్దె దింపుతూ వస్తున్నారు. వారి మనోబలమే మనదేశానికి శ్రీరామరక్షా. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసి, అసమ్మతికి అవకాశం లేకుండా చేస్తూ పాలన సాగించాలి అనుకొనే వారికి ఎమర్జెన్సీ ఓ విధంగా హెచ్చరికగా మిగులుతుంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News