గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున
కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ ప్రభుత్వ లాంఛనాలతో
అంత్యక్రియలు సిఎం రేవంత్, పలువురు మంత్రుల నివాళి మాగంటి
భౌతికకాయాన్ని చూసి విలపించిన కెసిఆర్ పాడె మోసిన కెటిఆర్,
హరీశ్రావు గోపీనాథ్ మృతి పట్ల చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ కి చెందిన జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్(62) కన్నుమూశారు. గత మూడు రో జులుగా గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో ఆయన తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షిం చి, ఆయన కార్డియాక్ అరెస్ట్కు గురైనట్లు నిర్ధారించారు. వెంటనే సిపిఆర్ చేయడంతో గుండె స్పందించింది. అనంతరం నాడీ, రక్తపోటు సా ధారణ స్థితికి రావడంతో ఐసియులో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు.అయితే, మా గంటి గోపీనాథ్ గత కొంతకాలంగా కిడ్నీ సం బంధిత సమస్యలతో కూడా పోరాడుతున్నారు. గుండెపోటుతో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ,
ఆరోగ్యం విషమించడం తో ఆదివారం ఉదయం 5:45 గంటల ప్రాం తంలో తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపా రు. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం ఎఐజి హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్దివ దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్ భౌతికకాయాన్ని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున మాగంటి నివాసానికి తరలివెళ్లారు.
మూడుసార్లు ఎంఎల్ఎగా..
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో టిడిపిలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టిఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టిడిపి నుంచి ఎంఎల్ఎగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో టిఆర్ఎస్(ప్రస్తుతం బిఆర్ఎస్)లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు ఎంఎల్ఎగా ఆయన గెలుపొందారు. 2022లో బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగానూ మాగంటి గోపీనాథ్ పనిచేశారు.
అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు
జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాదాపూర్లోని నివాసం నుంచి మొదలైన మాగంటి అంతిమయాత్రలో కెటిఆర్, హరీష్ రావు కలిసి పాడె మోసారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో కెటిఆర్తో పాటు బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, మాగంటి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు.
నివాళులు అర్పించిన సిఎం రేవంత్రెడ్డి
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మాగంటి భౌతిక కాయానికి సిఎం రేవంత్రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. మాగంటి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్రావులతో పాటు పలువురు ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు మాగంటి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యలను ఓదార్చారు.