లీడ్స్: భారత్తో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుది. 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 21/0 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం ఐదో, చివరి రోజు బ్యాటింగ్ను చేపట్టిన ఇంగ్లండ్కు ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ అండగా నిలిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. క్రాలీ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా డకెట్ దూకుడుగా ఆడాడు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లంచ్ విరామ సమయానికి ముందే డకెట్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
తొలి సెషన్లో ఇంగ్లండ్ 24 ఓవర్లలో 96 పరుగులు చేసింది. తర్వాత డకెట్ మరింత దూకుడుగా ఆడాడు. అతనికి క్రాలీ పూర్తి సహకారం అందించాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో ఇంగ్లండ్ లక్షం దిశగా సాగింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన క్రాలీ 126 బంతుల్లో ఏడు ఫోర్లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. వన్డౌన్లో వచ్చిన ఓలి పోప్ (8) నిరాశ పరిచాడు. కానీ జో రూట్ అండతోడకెట్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన బెన్ డకెట్ 170 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్తో 149 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక జో రూట్ 84 బంతుల్లో ఆరు ఫోర్లతో అజేయంగా 53 పరుగులు సాధించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ జేమీ స్మిత్ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. దీంతో ఇంగ్లండ్ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది.