న్యూఢిల్లీ: మాజీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్లపై అవినీతి కేసు నమోదు అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ (ACB) గురువారం మాజీ మంత్రులపై కేసు నమోదు చేసింది. 11 గ్రీన్ఫీల్డ్, 13 బ్రౌన్ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టులతో సహా మొత్తం 24 ఆసుపత్రి సంబంధిత ప్రాజెక్టులను 2018–19లో ఆప్ ప్రభుత్వం ఆమోదించింది. వీటి అంచనా వ్యయం రూ. 5,590 కోట్లు. అయితే, ఈ ప్రాజెక్టుల్లో భారీ జాప్యాలు, విపరీతమైన ఖర్చు పెంచడం, ఆర్థిక దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎసిబి అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీ అంతటా ఆసుపత్రి భవనాలు, పాలీక్లినిక్లు, ICU మౌలిక సదుపాయాల అమలులో స్పష్టమైన అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిర్ణీత గడువులోపు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, అనేక ప్రాజెక్టుల్లో వందల కోట్లకు పైగా ఖర్చును చూపించారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. మాజీ మంత్రులపై కేసు నమోదు చేశారు.