అమరావతి: పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి లో పొగాకు బోర్డును సందర్శించారు. పొగాకు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నానని, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడని చెప్పారు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న పొగాకు రైతులను పరామర్శించారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో ఏ పంటకు గిట్టబాటు ధర లేదని మండిపడ్డారు.
తమ హయాంలో రైతు రాజ్యం నడిచిందని, ఖరీఫ్ సీజన్ లోనే పెట్టుబడి సాయం అందించామని తెలియజేశారు. చంద్రబాబు వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కాక మరో రూ. 20 వేలు ఇస్తామన్నారని, గతేడాది ఇవ్వాల్సిన రైతు భరోసా రూ. 20 వేలు ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. రైతుభరోసా (Farmer Assurance) నరేంద్ర మోడీ ఇచ్చారని, బాబు ఎగ్గొట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇన్ ఫుట్ సబ్సిడీ గాలికొదిలేసిందని, దళారీలు లేకుండా పంట కొనే పరిస్థితి లేదని చెప్పారు. తమ హయాంలో ఆర్బీకేలు రైతుకు వెన్నెముకగా నిలిచాయని, కూటమి సర్కార్ వచ్చాక కల్తీ విత్తనాలతో రైతు నష్టపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చామని, ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలు అదనంగా ఇచ్చేవాళ్లమని చెప్పారు. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు ఎమ్ఎస్ పి ఇచ్చామని, ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్ బికే ద్వారా ఇచ్చేవాళ్లమని వెల్లడించారు. తమ హయాం రైతులకు సువర్ణయుగమని, ఐదెకరాల మిర్చి రైతుకు రూ. 4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత తమదని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అనే రీతిలో బాబు పాలన ఉందని, పొగాకు పంట వేసుకోమని చెప్పి ఇప్పుడు నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. మార్క్ ఫెడ్ వేలంలో ప్రభుత్వం ఎందుకు పాల్గొనలేదని, చంద్రబాబుకు చెప్పినా ఫలితం లేదని రైతులు అంటున్నారని అన్నారు. చంద్రబాబు సిఎం కావడం.. రైతులకు శాపం అని జగన్ స్పష్టం చేశారు.