అమీర్పేట్ మైత్రీవనంలోని హెచ్ఎండిఏ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు తమ భూములు ఇవ్వబోమంటూ భూములు కోల్పోయే రైతులు ఆందోళనకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. తక్కువ ధరకు తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. చౌటుప్పల్ దగ్గర పాత అలైన్మెంట్ను మార్చారని పాత అలైన్మెంట్లోనే ఆర్ఆర్ఆర్ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. తమ భూముల జోలికి రావద్దంటూ నినాదాలు చేస్తూ హెచ్ఎండిఏ ఆఫీసు ఎదుట వారు ఆందోళనకు దిగారు. ఇటీవలే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించిన ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అలైన్మెంట్ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 15వ తేదీలోపు తెలపాలని అధికారులు కోరారు.
ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏ కార్యాలయం వద్దకు చేరుకొని భూములు ఇవ్వబోమంటూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అలైన్మెంట్ ఎనిమిది జిల్లాలు, 33 మండలాలు అలాగే 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలకు విస్తరించగా, డిజిటల్ మ్యాప్లు, సర్వే నంబర్లను హెచ్ఎండిఏ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈనెల 15వ తేదీలోపు ఏదైన అభ్యంతరాలు, సూచనలు ఉంటే హెచ్ఎండిఏ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులు కోరారు. దీని తర్వాత హెచ్ఎండిఏ చివరి నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.