Monday, September 15, 2025

అంధకారంలో 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సిఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు, కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తాము 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించామని చెప్పారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెల్లించామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవన్న సాకుతో పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చు అవుతున్నాయి, రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాలేజీల బంద్‌ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

కాంగ్రెస్ ఎంఎల్‌ఎ గన్‌మెన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకెళ్లారు
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న యూరియా కొరత, సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని కెటిఆర్ పేర్కొన్నారు. రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ గన్‌మెన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల దోపిడికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఒక గన్ మ్యాన్ లారీ లోడ్ యూరియా ఎత్తుకుపోతే ఇక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఎంత దోచుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. గత ముఖ్యమంత్రులు ఎన్‌టిఆర్,చంద్రబాబు, వైఎస్‌ఆర్, రోశయ్యలు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కెసిఆర్ కొనసాగించారని కెటిఆర్ గుర్తుచేశారు.

అయితే కెసిఆర్ పేరు ఉందన్న ఏకైక కారణంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. కెసిఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు అన్నింటినీ ఆపేశారని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుతింటున్నారని మండిపడ్డారు.అప్పులు చేయకుండా ఆదాయం పెంచి పాలన చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నిర్వాకంతో ఊర్లలో అత్తా, కోడళ్ల మధ్య కొత్త పంచాయతీలు మొదలయ్యాయని అన్నారు.

హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది
హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు మంత్రులు పోవాలి, కానీ ఉప ఎన్నికల ప్రచారంలో తిరగొద్దని అన్నారు.కెసిఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని చెప్పారు. గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే మొదలవ్వాలని అన్నారు. తెలంగాణ దివాలా తీసింది, ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నాడని విమర్శించారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇంటిని కూల్చేసేందుకు పర్మిషన్ ఇచ్చినట్టే
చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉన్న మాగంటి గోపీనాథ్ సేవలను కెటిఆర్ గుర్తు చేసుకున్నారు. తామంతా కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పిజెఆర్, కెసిఆర్ పోరాట స్ఫూర్తితో బిఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ ఇంటిని కూల్చివేసేందుకు పర్మిషన్ ఇచ్చినట్టే అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని కార్యకర్తలకు సూచించారు. జిఒ నెంబర్ 58, 59 కింద లక్ష మందికి కెసిఆర్ పట్టాలిచ్చారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేల మంది ఇళ్లను కూలగొట్టిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా మోసం చేసినందుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గోస పెడుతున్నందుకు, హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించి మాగంటి గోపినాథ్‌కు నివాళి అర్పించాలని కెటిఆర్ పార్టీ శ్రేణులను కోరారు.

Also Read:

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News