అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటనలో విచారణకు అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్) లభ్యమైంది. ప్రమాద స్థలంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు గాలించి ఈ సివిఆర్ను వెలికి తీయగలిగారు. ప్రమాదానికి కారణాలేమిటో గుర్తించడంలో ఇది కీలకమైన సాక్షంగా భావిస్తున్నారు. ఇందులో పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్మిషన్లు, వార్నింగ్ అలారంలు రికార్డయి ఉంటాయి. విమానం స్పీడ్, ఎత్తు, ఇంజిన్ పనితీరు వంటి సాంకేతిక వివరాలను అందించే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) తోపాతు డిజిటల్ వీడియో రికార్డర్లను ఇప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్బాక్స్లను కూడా స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. వీటన్నిటివల్ల విమాన ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాకు అధికారులు తెలిపారు. మేఘానినగర్ బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ దగ్గర ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మిశ్రా పరిశీలించారు. సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. అక్కడే సర్కూట్ హౌస్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) , ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాద సంఘటనలపై తక్షణం ఎలా స్పందించి చర్యలు తీసుకున్నామో ఆయనకు వివరించారు. దర్యాప్తు ప్రయత్నాలపై చర్చించారు. బాధితులకు కావలసిన సాయం అందించడానికి ప్రధాని మోడీ అంకిత భావంతో ఉన్నారని మిశ్రా తెలియజేశారు.